
టోల్ ఛార్జీ రూల్స్లో కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. ఇప్పటినుంచి ఉన్నవాటిని పక్కన పెట్టి కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. ఏప్రిల్ 10వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా ఉన్న జాతీయ రహదారులపై ఇవి అమల్లోకి రానున్నాయి. ఇక నుంచి హైవేలపై క్యాష్ పేమెంట్స్ బంద్ కావడంతో పాటు యూపీఐ ద్వారా చెల్లింపులు చేస్తే అధిక ఛార్జీలు, ఐడీ కార్డులపై మినహాయింపులు నిలిపివేత వంటి కీలక నిర్ణయాలు ఉన్నాయి. మీరు ఒకవేళ జాతీయ రహదారులపై ఎక్కువగా ప్రయాణం చేస్తుంటే కొత్త నిబంధన గురించి తెలుసుకోవాల్సిందే. లేకపోతే మీకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశముంది. ఏప్రిల్ 10 నుంచి మారనున్న కొత్త రూల్స్ ఏంటో ఒకసారి చూద్దాం.
ప్రభుత్వ అధికారులు, రక్షణ సిబ్బంది, టోల్ ఫీజు చెల్లింపులు మినహాయింపులకు అర్హత కలిగిన వ్యక్తులు తమ ఐడీ కార్డ్ చూపించి పొందే ప్రయోజనాలను రద్దు చేసింది. ఇప్పటివరకు వ్యక్తిగత వాహనాల్లో ప్రయాణించే సమయంలో కూడా ఐడీ కార్డు చూపించి టోల్ ఫీజు చెల్లించుకుండా వెళ్లిపోతున్నారు. ఇప్పుడు ఈ విధానం బంద్ కానుంది. కేవలం ప్రభుత్వ వాహనాల్లో ప్రయాణించేవారికి మాత్రమే మినహాయింపు లభిస్తుంది. ఈ కొత్త రూల్స్పై అన్ని ప్రభుత్వ శాఖలకు ఎన్హెచ్ఏఐ లేఖలు రాసింది. కేవలం ప్రభుత్వ వాహనాల్లో ప్రయాణిస్తేనే చట్టబద్దంగా ట్యాక్స్ మినహాయింపులు ఉంటాయని, ప్రైవేట్ వాహనాల్లో ప్రయాణించే సమయంలో ఎలాంటి మినహాయింపులు ఉండనవి లేఖలో ప్రస్తావించింది. చట్ట ప్రకారం అర్హత ఉన్న వాహనాలకు మినహాయింపు పొందిన ఫాస్టాగ్ లేదా వార్షిక పాస్ పొందాలని సూచించింది. మినహాయింపు ప్రభుత్వ కార్యాలయాలు లేదా సంస్థకు మాత్రమే చెల్లుబాటు అవుతుందని, వ్యక్తికి కాదని స్పష్టం చేసింది. ప్రైవేట్ కారులో వెళ్తున్నప్పుడు ప్రభుత్వం గుర్తింపు కార్డును ఉపయోగించడం సరికాదని తెలిపింది.
ఇకపై టోల్ గేట్ల వద్ద ఆగాల్సిన పని ఉండదు. జాతీయ రహదారులపై అవరోధ రహిత, ఓపెన్ రోడ్ టోలింగ్ అనే బహుళ లైన్ల ఫ్రీ ఫ్లో టోలింగ్ వ్యవస్థను కేంద్రం తీసుకొచ్చింది. దీని వల్ల హైవేలపై ఏర్పాటు చేసే RFID రీడర్లు మీ వాహనాన్ని గుర్తించి ఆటేమేటిక్గా ఫాస్టాగ్ ద్వారా టోల్ ఛార్జీ తీసివేస్తాయి. ఇక ఫాస్టాగ్ లేనివారికి ప్రయాణం ముగిశాక ఈ నోటీస్ జారీ వుతుంది. ఈ నోటీస్ అందిన 15 రోజుల్లోగా చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం 98 శాతానికిపైగా టోల్ ట్రాన్సాక్షన్లు డిజిటల్ రూపంలో జరుగుతున్నాయి. దీంతో ఏప్రిల్ 10వ తేదీ నుంచి అమల్లోకి రానున్న వీటికి మౌలిక సదుపాయాలు అందుబాటో ఉంటాయి. అటు ఫాస్టాగ్ వార్షిక పాస్ ధరలు ఇటీవల పెరిగాయి. గతంలో ఉన్న ధరపై 2.5 శాతం పెంచారు. దీంతో ప్రస్తుతం రూ.3075 వద్ద కొనసాగోతంది.