విదేశాలకు వెళ్లేందుకు పాస్ పోర్టు, వీసాతో పాటు విమానం టికెట్ ఉండాలి. వీటి ద్వారా నచ్చిన దేశాలలో హాయిగా పర్యటించవచ్చు. ఈ విషయం దేశంలో ప్రతి ఒక్కరికీ తెలిసిందే. అయితే విదేశాలకు వెళ్లేవారందరూ పన్ను క్లియరెన్స్ సర్టిఫికెట్ సమర్పించాలంటూ సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేశాయి. ఇటీవల పార్లమెంటులో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ లో ఈ మేరకు ప్రతిపాదనలకు చేశారంటూ వార్తలు వచ్చాయి. అయితే విదేశాలకు వెళ్లేందుకు నిజంగా పన్ను క్లియరెన్స్ సర్టిఫికెట్ అవసరమా? అని అడిగితే.. అవసరమే అంటోంది కేంద్ర ప్రభుత్వం. కానీ అందరికీ కాదని స్పష్టం చేస్తోంది. నల్లధనం చట్టం(బ్లాక్ మనీ యాక్ట్) ప్రకారం ఎవరు ఈ సర్టిఫికెట్ అందజేయాలో తెలుస్తుంది. దీనికి సంబంధించిన వివరాలు ఇప్పుడు చూద్దాం..
బ్లాక్ మనీ యాక్ట్, 2015లో ఓ సూచనను చేర్చాలని 2024 బడ్జెట్ లో ఆర్థిక మంత్రిత్వశాఖ ప్రతిపాదించింది. దీని ప్రకారం ప్రతి ఒక్కరూ తమ పన్ను బాధ్యతలను పూర్తి చేసి క్లియరెన్స్ సర్టిఫికెట్ పొందాల్సి ఉంటుంది. అయితే ఈ ప్రతిపాదన అందరికీ వర్తించదని ప్రభుత్వం వివరణ ఇచ్చింది. ఈ నేపథ్యంలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (సీబీడీటీ) ప్రతిస్పందించింది. ఆదాయపు పన్ను చట్టం 1961లోని సెక్షన్ 230 ప్రకారం దేశం విడిచి వెళ్లే ముందు తప్పనిసరి పన్ను క్లియరెన్స్ అవసరం కాదని తెలిపింది. ఆ వివరాల ప్రకారం..ప్రతి వ్యక్తి పన్ను క్లియరెన్స్ సర్టిఫికెట్ పొందాల్సిన అవసరం లేదు. నిర్దిష్ట వ్యక్తుల విషయంలో మాత్రమే దానిని అమలు చేస్తారు.
ఒక వ్యక్తి తీవ్రమైన ఆర్థిక అవకతవకలకు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న సమయంలో, ఆదాయపు పన్ను లేదా సంపద పన్ను చట్టం కింద అతడిని విచారణ చేయాల్సిన ఉంటే, అతడికి పన్ను డిమాండ్ పెరిగే అవకాశం ఉన్నప్పుడు క్లియరెన్స్ సర్టిఫికెట్ అవసరం.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..