
ఉల్లి సాగు చేసే రైతులకు లబ్ధి చేకూర్చేలా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ధరల స్థిరీకరణ బఫర్ స్టాక్ సేకరణ కోసం ఉల్లిపాయల కొనుగోలు ధరను భారీగా పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు క్వింటాల్కు రూ.1,875 గా ఉన్న సేకరణ ధరను ఏకంగా 13 శాతం పెంచి రూ.2,125 చేసింది. సవరించిన ధరలు తక్షణమే అమలులోకి తీసుకొచ్చింది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం దేశవ్యాప్తంగా నాఫెడ్ (NAFED), ఎన్సిసిఎఫ్ (NCCF) సంస్థల ద్వారా ఉల్లిపాయల సేకరణ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. ప్రభుత్వ తాజా నిర్ణయం వల్ల ఉల్లి రైతులకు మార్కెట్లో మెరుగైన రాబడి లభించడంతో పాటు, భవిష్యత్తు అవసరాల కోసం ప్రభుత్వ బఫర్ స్టాక్ సేకరణ ప్రయత్నాలు మరింత బలోపేతం కానున్నాయి.
దేశంలో సమృద్ధిగా ఉన్న ఉల్లి నిల్వలు
వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ విడుదల చేసిన 2025-26 ద్వితీయ ముందస్తు అంచనాల ప్రకారం.. దేశంలో ఉల్లి ఉత్పత్తి 307.37 లక్షల మెట్రిక్ టన్నులుగా నమోదయ్యే అవకాశం ఉంది. ఇది గత ఏడాది (2024-25) నాటి 307.67 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తితో సమానంగా ఉంది. ప్రస్తుత అంచనాల ప్రకారం దేశంలో ఉల్లి లభ్యతకు ఎలాంటి డోకా లేదని, అయితే సాధారణ కాలానుగుణ మార్పుల వల్ల ధరల్లో స్వల్ప పెరుగుదల ఉండవచ్చని అధికారులు తెలిపారు. ప్రస్తుతం మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్ వంటి ప్రధాన రాష్ట్రాలలో తగినంత నిల్వలు అందుబాటులో ఉన్నాయి.
మార్కెట్ ధరలు ఎలా ఉన్నాయంటే
దేశవ్యాప్తంగా రోజువారీ మండి రాకలు 50,000 మెట్రిక్ టన్నులకు పైగా బలంగా ఉండగా, కేవలం మహారాష్ట్రలోనే 30,000 మెట్రిక్ టన్నుల కంటే ఎక్కువ ఉల్లి మార్కెట్కు వస్తోంది. హోల్సేల్ మార్కెట్లలో సగటు మోడల్ ధర కిలోకు సుమారుగా రూ.18 పలుకుతోంది. ఇక దేశవ్యాప్తంగా సగటున కిలో ఉల్లిపాయల చిల్లర ధర రూ.31 వద్ద కొనసాగుతోంది. రుతుపవనాల రాకలో జాప్యం, కొన్ని ప్రాంతాలలో తక్కువ వర్షపాతం కారణంగా.. భవిష్యత్తులో ధరలు పెరుగుతాయనే అంచనాతో నాసిక్, మధ్యప్రదేశ్లోని కొన్ని ప్రధాన కేంద్రాల్లో వ్యాపారులు ముందస్తు ఊహాజనిత కొనుగోళ్లకు పాల్పడుతున్నారు. అయితే ప్రస్తుతం వినియోగదారుల మార్కెట్లలో చెప్పుకోదగ్గ డిమాండ్ ఏమీ లేదని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.
కొనసాగుతున్న ఉల్లి ఎగుమతులు
గత జూన్ నెలలో సుమారు 1.50 లక్షల మెట్రిక్ టన్నుల ఉల్లిపాయలు విజయవంతంగా ఎగుమతి అయ్యాయి. అయితే గల్ఫ్ దేశాలు, శ్రీలంక, ఫార్ ఈస్ట్ వంటి అంతర్జాతీయ మార్కెట్లలో పాకిస్తాన్, చైనాల నుండి కొత్త పంట పోటీ ధరలకు అందుబాటులోకి రావడం వల్ల, భారతీయ ఉల్లి ఎగుమతుల వేగం కొద్ది కాలం పాటు మందగించే అవకాశం ఉందని వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరోవైపు, వర్షాల జాప్యంతో మహారాష్ట్రలోని నాసిక్ ప్రాంతంలో ఖరీఫ్ ఉల్లి విత్తనాలు వేయడం దాదాపు 15 రోజులు ఆలస్యమైంది.
అలాగే కర్ణాటకలోని చిత్రదుర్గ, చల్లకెరె ప్రాంతాలలో విత్తనాలు వేసే ప్రక్రియ సాధారణం కంటే కేవలం 60 శాతంగానే నమోదైంది. అత్యుత్తమ నాణ్యత కలిగిన నిల్వలను ప్రస్తుతం భద్రపరిచామని, సరఫరా తక్కువగా ఉండే కాలంలో వీటిని మార్కెట్లోకి విడుదల చేసి ధరలను అదుపు చేస్తామని ప్రభుత్వం వెల్లడించింది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.