UPI Payments: రూ.10 వేల కంటే ఎక్కువ పంపాలంటే గంట ఆగాల్సిందే.. కొత్త రూల్‌పై ఆర్బీఐ మరో అప్డేట్..

యూపీఐలో రూ.10 వేల కంటే ఎక్కువ పంపిననప్పుడు గంట పాటు కూలింగ్ పీరియడ్ ఉంటుంది. గంట పాటు ట్రాన్సాక్షన్ ఆపుతారు. ఆ వెయిటింగ్ పీరియడ్ అయ్యాకనే రిసీవర్ అకౌంట్లో పడతాయి. ఈ రూల్‌పై ఆర్బీఐ మరో అప్డేట్ ఇచ్చింది. వాటి వివరాలు చూస్తే..

UPI Payments: రూ.10 వేల కంటే ఎక్కువ పంపాలంటే గంట ఆగాల్సిందే.. కొత్త రూల్‌పై ఆర్బీఐ మరో అప్డేట్..
Upi 2

Updated on: Apr 15, 2026 | 12:36 PM

త్వరలో యూపీఐ రూల్స్ పూర్తిగా మారబోతున్నాయి. యూపీఐ చెల్లింపుల్లో భారీ మార్పులు రానున్నాయి. ఇప్పటివరకు యూపీఐ యాప్స్‌లో నగదు బదిలీ చేయాలనుకుంటే సెకన్ల వ్యవధిలోనే పని పూర్తవుతుంది. అయితే యూపీఐ ద్వారా మోసాలు జరుగుతున్న క్రమంలో ఆర్బీఐ కఠిన నిబంధనలను అమలు చేసేందుకు సిద్దమైంది. రూ.10 వేల కంటే ఎక్కువ నగదు పంపించాలనుకుంటే గంట పాటు వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. మీరు లావాదేవీ చేసిన గంట తర్వాతనే రిసీవర్ అకౌంట్లో పడతాయి. అయితే గంట ఆలస్యం చేయాలన్న ఈ నిబంధన ఆర్దిక వ్యవస్థలో ఆందోళన రేకెత్తిస్తోంది. బ్యాంకులు, ఫిన్‌టెక్ కంపెనీలు ఈ నిర్ణయంపై భగ్గుమంటున్నాయి.

మినహాయింపులు ఇచ్చిన ఆర్బీఐ

అయితే ఈ నిబంధనకు సంబంధించి ఆర్బీఐ కొన్ని మినహాయింపులు ఇచ్చింది. కొత్తగా మీరు ఎవరికైనా చెల్లించాలంటేనే గంట పాటు వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. అదే నమోదిత వ్యాపారులు, గతంలో చేర్చిన చెల్లింపుదారులకు పేమెంట్స్ చేసేటప్పుడు ఆలస్యం జరగదు. అలాగే లబ్దిదారులను వైట్ లిస్ట్ చేసుకునే సౌకర్యం కూడా వినియోగదారులకు ఉంటుది. వీటికి ఎలాంటి పరిమితులు ఉండవు. కొత్తగా చెల్లింపులు చేసేటప్పుడు మాత్రమే వెయిటింగ్ నిబంధన ఉంటుంది. అయితే యూపీఐ చెల్లింపులను ఆలస్యం చేయడం వల్ల నగదు వాడకం వైపు ప్రజలు మొగ్గు చూపే అవకాశం ఉందని అంటున్నారు. లావాదేవీలకు ఆటంకం కలిగించడం వల్ల సైబర్ మోసాలకు పరిష్కారం లభించకపోవచ్చని అభిప్రాయపడుతున్నారు.

యుపీఐ చెల్లింపుల్లో అంతరాయం

సెకన్ల వ్యవధిలోనే ట్రాన్సక్షన్లు చేసుకునే వెసులుబాటు ఉండటం వల్ల యూపీఐ ఆప్షన్‌ను ఎక్కువమంది వాడుతున్నారు. గంట పాటు చెల్లింపులను ఆలస్యం చేయడం వల్ల యూపీఐ చెల్లింపులకు అంతరాయం కలిగే అవకాశముందని ఆర్ధిక సంస్థలు హెచ్చరిస్తున్నాయి. వేగవంతమైన, సులభమైన డిజిటల్ చెల్లింపుల వ్యవస్థను ఇది దెబ్బతీస్తుందని అంటున్నారు. సైబర్ మోసాలను అరికట్టేందుకు ఆర్బీఐ ఈ ప్రతిపాదన తీసుకురాగా.. ఈ చర్య వల్ల మేలు కంటే కీడే ఎక్కువ జరిగే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు. వ్యాధి కంటే నివారణే మరింత ఘోరంగా ఉందన్న తరహాలో ఈ నిర్ణయం ఉందంటున్నారు. యూపీఐ చెల్లింపులను ఆలస్యం చేయడం కంటే సైబర్ మోసగాళ్లను గుర్తించి శిక్షించడంపై దృష్టి పెట్టాలని చెబుతున్నారు. ఆర్బీఐ నిర్ణయం రియల్ టైమ్ లావేదేవీలను నీరుగార్చే విధంగా ఉందని నిపుణులు విమర్శిస్తున్నారు. నెఫ్ట్, ఐఎంపీఎస్ లాంటి పద్దతుల ద్వారా పేమెంట్స్ చేయాలంటే అకౌంట్ నెంబర్, ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్ లాంటివి అవసరం. దీని వల్ల ఎక్కువమంది యూపీఐ వాడుతున్నారు. ఆర్బీఐ తీసుకున్న నిర్ణయం యూపీఐ లావాదేవీలను తీవ్రంగా ప్రభావితం చేసే అవకాశముంది.

Follow Us