Air India: విమాన ప్రయాణికులకు షాకిచ్చిన ఎయిర్‌ ఇండియా! టికెట్ ధరలపై ప్రభావం

ఇంధన ధరల పెరుగుదల నేపథ్యంలో ఎయిర్‌ ఇండియా ఏప్రిల్ 8 నుండి ఇంధన సర్‌ఛార్జీలను పెంచింది. ఏటీఎఫ్ ధరల పెంపుతో దేశీయ, అంతర్జాతీయ విమాన ఛార్జీలు అధికమయ్యాయి. దేశీయ మార్గాల్లో దూరం ఆధారిత గ్రిడ్ విధానం, అంతర్జాతీయ మార్గాల్లో గణనీయమైన పెంపులు అమలులోకి వచ్చాయి.

Air India: విమాన ప్రయాణికులకు షాకిచ్చిన ఎయిర్‌ ఇండియా! టికెట్ ధరలపై ప్రభావం
Air India

Updated on: Apr 08, 2026 | 6:41 AM

ఇంధన ధరలు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో టాటా గ్రూప్‌కు చెందిన ఎయిర్‌ ఇండియా దేశీయ, అంతర్జాతీయ మార్గాల్లో ఇంధన సర్‌ఛార్జీలను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఏటీఎఫ్ (ఎవియేషన్ టర్బైన్ ఫ్యూయల్) ధరలు పెరగడం వల్ల విమానయాన సంస్థలపై ఆర్థిక భారం పెరిగిందని కంపెనీ తెలిపింది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 8 నుంచి కొత్త సర్‌ఛార్జీలు అమల్లోకి రానున్నట్లు వెల్లడించింది.

ఇప్పటివరకు దేశీయ మార్గాల్లో ఫ్లాట్ రేటు విధానాన్ని అనుసరించిన సంస్థ, ఇప్పుడు దూరం ఆధారిత గ్రిడ్ విధానాన్ని ప్రవేశపెట్టింది. ప్రయాణ దూరాన్ని బట్టి రూ.299 నుంచి రూ.899 వరకు ఇంధన సర్‌ఛార్జీలు నిర్ణయించబడ్డాయి. ఇదే సమయంలో అంతర్జాతీయ మార్గాల్లో మరింత గణనీయమైన పెంపులు అమలు చేశారు. పశ్చిమ ఆసియా, యూరప్, ఉత్తర అమెరికా వంటి మార్గాల్లో సర్‌ఛార్జీలు గణనీయంగా పెరగడం గమనార్హం.

ఈ నిర్ణయానికి ప్రధాన కారణంగా ప్రపంచవ్యాప్తంగా జెట్ ఇంధన ధరల పెరుగుదల నిలుస్తోంది. ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అసోసియేషన్‌ (IATA) గణాంకాల ప్రకారం 2026 మార్చి చివరికి జెట్ ఇంధన ధర బ్యారెల్‌కు సుమారు 195 డాలర్లకు చేరుకుంది. ఇది కేవలం ఒక నెల వ్యవధిలోనే దాదాపు రెట్టింపు పెరుగుదల నమోదైనట్లు సూచిస్తోంది. పశ్చిమ ఆసియా ప్రాంతంలో నెలకొన్న ఉద్రిక్తతలు చమురు సరఫరాపై ప్రతికూల ప్రభావం చూపడంతో ఇంధన కొరత ఏర్పడింది. దీని ప్రభావం ప్రపంచవ్యాప్తంగా విమానయాన రంగంపై పడింది. ఇప్పటికే బుక్ చేసిన టిక్కెట్లపై ఈ కొత్త సర్‌ఛార్జీలు వర్తించవని ఎయిర్‌ ఇండియా స్పష్టం చేసింది. అయితే ప్రయాణ తేదీల మార్పులు లేదా టికెట్ సవరణలు చేస్తే తాజా చార్జీలు అమలులోకి వస్తాయని తెలిపింది. పరిస్థితిని బట్టి భవిష్యత్తులో కూడా సర్‌ఛార్జీలను సమీక్షిస్తూ అవసరమైన సవరణలు చేస్తామని సంస్థ పేర్కొంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us