8th Pay Commission: బేసిక్‌ పే రూ.18000 నుంచి రూ.69000లకు పెరుగుతుందా? కీలక అప్డేట్‌

పెరుగుతున్న ద్రవ్యోల్బణం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 8వ వేతన సంఘంపై ఆశలు పెరుగుతున్నాయి. కనీస మూల వేతనాన్ని రూ.18,000 నుండి రూ.69,000కు పెంచాలనే ప్రతిపాదన హాట్‌టాపిక్‌గా మారింది. JCM ప్రతిపాదించిన 3.833 ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ దీనికి కీలకం. మరిన్ని వివరాలు ఇలా ఉన్నాయి.

8th Pay Commission: బేసిక్‌ పే రూ.18000 నుంచి రూ.69000లకు పెరుగుతుందా? కీలక అప్డేట్‌
8th Pay Commission

Updated on: Apr 22, 2026 | 6:03 AM

పెరుగుతున్న ద్రవ్యోల్బణం, గృహ ఖర్చుల భారంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఊరట కలిగించేలా 8వ వేతన సంఘంపై అంచనాలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా కనీస మూల వేతనాన్ని ప్రస్తుత రూ.18,000 నుంచి రూ.69,000కు పెంచాలనే ప్రతిపాదన హాట్‌టాపిక్‌గా మారింది. ఇది అమల్లోకి వస్తే ఒకేసారి రూ.51,000 పెరుగుదలతో భారీ మార్పు చోటుచేసుకునే అవకాశం ఉంది. ఈ డిమాండ్ వెనుక ప్రధానంగా ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ అనే గణన ఉంటుంది. ఉద్యోగుల ప్రయోజనాలను ప్రతినిధ్యం వహిస్తున్న నేషనల్‌ కమిషన్‌ JCM 3.833 ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను ప్రతిపాదించింది. దీని ప్రకారం జీతాలు, పెన్షన్లు గణనీయంగా పెరుగుతాయని భావిస్తున్నారు. పెరుగుతున్న జీవన వ్యయాలను దృష్టిలో పెట్టుకుని ఈ కొత్త గణనను తీసుకొచ్చినట్లు సంఘాలు చెబుతున్నాయి.

ఈ పెంపు వెనుక మరో ముఖ్యమైన కారణం ఖర్చుల లెక్కింపు విధానంలో మార్పు. ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ సూచించిన 3,490 కేలరీల ఆహార ప్రమాణాన్ని ఇప్పుడు లెక్కల్లో తీసుకుంటున్నారు. అంతేకాకుండా కుటుంబ పరిమాణాన్ని కూడా మూడు మందుల నుంచి ఐదుగురికి పెంచడం వల్ల ఖర్చుల అంచనాలు గణనీయంగా పెరిగాయి. ఢిల్లీ, ముంబై, బెంగళూరు వంటి ప్రధాన నగరాల్లోని నిత్యావసర వస్తువుల ధరలను ఆధారంగా తీసుకుని ఈ లెక్కలు రూపొందించబడినట్లు సమాచారం.

అయితే ఈ భారీ ప్రతిపాదనను ప్రభుత్వం యథాతథంగా అంగీకరిస్తుందా అన్నది అనుమానంగానే ఉంది. గతంలో 7వ వేతన సంఘం సమయంలో ఉద్యోగ సంఘాలు 3.71 ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ కోరినా, ప్రభుత్వం దానిని 2.57కు పరిమితం చేసింది. ఆర్థిక లోటు, ఖర్చుల భారాన్ని దృష్టిలో పెట్టుకుని ఈసారి కూడా మధ్యస్థ మార్గాన్ని ఎంచుకునే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ఇక అమలు కాలక్రమం విషయానికి వస్తే, 8వ వేతన సంఘం నివేదిక 2027 మే నాటికి సమర్పించే అవకాశముంది. ఆ తర్వాత ప్రభుత్వం పరిశీలన చేసి అమలు చేయడానికి మరో 3–6 నెలలు పట్టవచ్చు. అన్ని ప్రక్రియలు సజావుగా జరిగితే, 2027 ద్వితీయార్థంలో పెరిగిన జీతాలు ఉద్యోగుల ఖాతాల్లో జమ కావచ్చని అంచనా.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us