#War against Covid-19 ఏపీలో 3 నగరాలు డేంజర్ జోన్‌లో.. సర్కార్ అప్రమత్తం

|

Mar 28, 2020 | 3:10 PM

ఏపీలో ఆ మూడు నగరాలను డేంజర్ జోన్‌గా పరిగణిస్తోంది ఏపీ ప్రభుత్వం. ఆ నగరాల్లో కరోనా విపరీతంగా ప్రబలే సంకేతాలున్నాయని ఏపీ ప్రభుత్వం అంచనా వేస్తోంది. దానికి అనుగుణంగా చర్యలు తీసుకోవాలని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికార యంత్రాంగాన్ని నిర్దేశించారు.

#War against Covid-19 ఏపీలో 3 నగరాలు డేంజర్ జోన్‌లో.. సర్కార్ అప్రమత్తం
Follow us on

Three cities in danger zone in Andhra Pradesh: ఏపీలో ఆ మూడు నగరాలను డేంజర్ జోన్‌గా పరిగణిస్తోంది ఏపీ ప్రభుత్వం. ఆ నగరాల్లో కరోనా విపరీతంగా ప్రబలే సంకేతాలున్నాయని ఏపీ ప్రభుత్వం అంచనా వేస్తోంది. వాలంటీర్ల సాయంతో నిర్వహించిన సర్వేలో తేలిన అంశాల ఆధారంగా ఓ చైన్ సిస్టమ్‌తో కరోనాను ఎదుర్కొనేందుకు ఏపీ ప్రభుత్వం సిద్దమైంది. విదేశాల నుంచి వచ్చిన వారిని చూసేందుకు ప్రతీ పది మందికి ఓ డాక్టర్ను కేటాయించాలని, ప్రతీ పది మంది డాక్టర్లకు ఓ స్పెషలిస్టును కేటాయించాలని ముఖ్యమంత్రి జగన్ తాజాగా ఆదేశాలు జారీ చేశారు.

వాలంటీర్లు చేసిన రెండో సర్వే, ఫలితాల ఆధారంగా తీసుకుంటున్న చర్యలపై సీఎం జగన్ శనివారం ఆరా తీసినట్లు సమాచారం. జిల్లాల్లో కోవిడ్‌ –19 నివారణ చర్యల కోసం స్వచ్ఛందంగా ముందుకు వచ్చే డాక్టర్లను గుర్తించి వారి సేవలను వినియోగించుకోవాలని సీఎం ఆదేశించారు. తమ సర్వే ద్వారా వాలంటీర్లు, ఆశావర్కర్లు, ఏఎన్‌ఎంలు గుర్తించిన వారిని డాక్టర్‌ దృష్టికి తీసుకువెళ్లి… నిర్దేశించుకున్న ప్రోటోకాల్‌ ప్రకారం వారికి వైద్యం అందించాలని సూచించారు.

వాలెంటీర్ల సాయంతో నిర్వహించిన అర్బన్‌ ఏరియాలపై మరింత దృష్టి పెట్టాలని, ముఖ్యంగా వైజాగ్, విజయవాడ, గుంటూరు నగరాలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని సీఎం నిర్దేశించారు. కోవిడ్‌ నివారణా చర్యల కోసం హౌస్‌ సర్జన్ల సేవలు వినియోగించుకోవాలని, డాక్టర్లు, స్పెషలిస్టుల మధ్య వీడియో కాన్ఫరెన్స్‌ సదుపాయం కల్పించాలని సీఎం ఆదేశించారు. ప్రతి యాభై ఇళ్ల పరిస్థితులను ఎప్పటికప్పుడు వాలంటీర్లు నమోదు చేయాలని, వారి రిపోర్టుల అధారంగా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

వాలంటీర్లు, ఆశావర్కర్లు. వైద్యులకు ఇన్ఫెక్షన్ సోకకుండా.. ప్రొటెక్షన్‌ సూట్లు, పరికరాలు అందించాలని చెప్పారు సీఎం జగన్. దేశంలో ఎక్కడ దొరుకుతున్నా… వాటిని కొనుగోలు చేసి, హెల్త్ వర్కర్లకు అందించాలని ఆయన అధికారులకు సూచించారు. కరోనా టెస్టింగ్‌ సామర్థ్యాన్ని పెంచడంపైనా దృష్టి పెట్టాలని, ఎవరికి లక్షణాలు కలించినా వారిని ఐసోలేషన్‌లో పెట్టాలని ఆదేశించారు. గూడ్స్, నిత్యావసర వస్తువుల వాహనాలను నిలిపేస్తున్నారంటూ ఫీడ్‌ బ్యాంకు వస్తోందని, దానిపై దృష్టి పెట్టాలని సీఎం అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు.