Andhra BJP Chief Kanna Laxminarayana’s daughter-in-law suspect death in Hyderabad: ఆంధ్రప్రదేశ్ బీజేపీ శాఖ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఇంట విషాదం నెలకొంది. హైదరాబాద్ నగరంలో నివాసముండే కన్నా లక్ష్మీ నారాయణ కోడలు గురువారం అనుమానాస్పద రీతిలో మృతి చెందింది. కన్నా కోడలు నల్లపురెడ్డి సుహారిక గురువారం మధ్యాహ్నం తన స్నేహితురాలి ఇంటికి వెళ్ళి కుప్పకూలిపోయింది. దగ్గరలోని ఆసుపత్రికి తరలించగా.. ఆమె అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు.
ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ కోడలు సుహారిక తన భర్త ఫణీంద్రతో కలిసి గచ్చిబౌలి ఫీల్ రిడ్జ్స్ విల్లాస్లో నివాసం ఉంటున్నారు. గురువారం మధ్యాహ్నం రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని మీనాక్షి బాంబ్ విల్లాస్లో నివాసముండే తన స్నేహితురాలి ఇంటికి వెళ్ళారు. వెళ్ళి వెళ్ళగానే సుహారిక కుప్పకూలి పడిపోయిందని స్నేహితురాలి కుటుంబీకులు చెబుతున్నారు. పడిపోయిన వెంటనే సుహారికను రాయదుర్గంలోని ఏ.ఐ.జీ. ఆసుపత్రికి తరలించారు. అయితే, హాస్పిటల్కు చేరుకునే లోపుగానే సుహారిక తుది శ్వాస విడిచిందని వైద్యులు ధృవీకరించారు. మరణానికి దారితీసిన కారణాలు పూర్తిగా ఇంకా తెలియరాలేదు.