మళ్ళీ తెరమీదికి రాయల తెలంగాణ ?

| Edited By: Pardhasaradhi Peri

Sep 19, 2019 | 2:36 PM

ఆరేళ్ళ క్రితం నాటి మాట… కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రత్యేక తెలంగాణ డిమాండ్ పై 2009 నుంచి చేస్తున్న జాప్యానికి తెర దించేందుకు ఉపక్రమించిన సమయం అది. హైదరాబాద్ తో కూడిన తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడమా ? హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేసి, ఏపీ, తెలంగాణ రాష్ట్రాలను ఏర్పాటు చేయడమా ? లేక రాయలసీమలోని అనంతపురం, కర్నూల్ జిల్లాలను తెలంగాణకు కలిపి రాయల తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసి, చిత్తూరు, కడప జిల్లాలను […]

మళ్ళీ తెరమీదికి రాయల తెలంగాణ ?
Follow us on

ఆరేళ్ళ క్రితం నాటి మాట… కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రత్యేక తెలంగాణ డిమాండ్ పై 2009 నుంచి చేస్తున్న జాప్యానికి తెర దించేందుకు ఉపక్రమించిన సమయం అది. హైదరాబాద్ తో కూడిన తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడమా ? హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేసి, ఏపీ, తెలంగాణ రాష్ట్రాలను ఏర్పాటు చేయడమా ? లేక రాయలసీమలోని అనంతపురం, కర్నూల్ జిల్లాలను తెలంగాణకు కలిపి రాయల తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసి, చిత్తూరు, కడప జిల్లాలను కోస్తాఆంధ్ర లోని మిగిలిన 9 జిల్లాలకు కలిపి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం… ఇలాంటి రకరకాల ఆలోచనలు చేస్తున్న తరుణంలో తెరమీదికొచ్చిన ప్రతిపాదనలు సమైక్య ఆంధ్ర రాష్ట్రంలో విస్తృత స్థాయిలో చర్చకు దారి తీశాయి. రాయల తెలంగాణకు సీమాంధ్రలోని బలమైన నేతలంతా ఓకే అన్నారు. హైదరాబాద్ కు చెందిన అసదుద్దీన్ ఒవైసి లాంటి వారు కూడా రాయల తెలంగాణ ప్రతిపాదనకు ఓకే అన్నారు. అయితే ఈ ప్రతిపాదనకు కెసిఆర్ సహా హార్డ్ కోర్ తెలంగాణ వాదులు విముఖంగా ఉండడంతో రాష్ట్రాన్ని విభజించినా కూడా రాజకీయంగా ఉపయోగం ఉండదన్న ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ అప్పట్లో రాయల తెలంగాణ ప్రతిపాదనను పక్కన పెట్టి.. పదేళ్లు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ను కొనసాగిస్తూ తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలను ఏర్పాటు చేసింది. ఆ క్రమంలో రాయల తెలంగాణ అంశం క్రమంగా తెరమరుగైపోయింది. అయితే తాజాగా ఈ ప్రతిపాదన మళ్ళీ వెలుగులోకి రావడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ హాట్ చర్చకు తెరలేపింది.

సమైక్య ఆంధ్ర ప్రదేశ్ విడిపోయిన తర్వాత ఏర్పాటైన ఆంధ్ర ప్రదేశ్ కు కర్నూల్ ని రాజధానిగా చేయాలని కొందరు సీమ నేతలు డిమాండ్ చేసినా అప్పటి ముఖ్య మంత్రి చంద్రబాబు అస్సలు ఖాతరు చేయలేదు. తాను స్వతహాగా గా సీమ ప్రాంతానికి చెందిన నాయకుడే అయినా కర్నూల్ ని రాజధాని చేసే అంశాన్ని పట్టించుకోకుండా అమరావతిని కొత్త రాజధాని గా ఎంపిక చేయడమే కాకుండా వరల్డ్ క్లాస్ కాపిటల్ గా దాన్ని డెవలప్ చేయెందుకు ప్రయత్నించారు. అయితే ఐదేళ్ల కాలంలో రాజధాని నిర్మాణంలో పెద్దగా అడుగులు ముందుకు పడకపోవడంతో ఇటీవలే సీఎంగా బాధ్యతలు చేపట్టిన వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి రాజధాని విషయంలో భిన్న మైన వైఖరి తీసుకున్నారు. కోర్ కాపిటల్ ప్రాంతాన్ని తరలిస్తారన్న పుకార్లకు వైసీపీ నేతలు బొత్స వంటి వారి కామెంట్లు దోహదం చేసాయి. ఈ క్రమంలో రాయల సీమ నేతల్లో మరోసారి కర్నూల్ కు ప్రాధాన్యత పెంచాలన్న ఆశ పుట్టింది. కర్నూల్ ని రెండో రాజధానిగా చేయాలని, కర్నూల్ లో హై కోర్ట్ ఏర్పాటు చేయాలని రాజ్యసభ సభ్యుడు టిజి వెంకటేష్ వంటి నేతలు డిమాండ్ చేయడం మొదలు పెట్టారు. తాజాగా అధికార వైసీపీ కి చెందిన పాణ్యం ఎమ్మెల్యే కాటసాని ఏకంగా “రాయల తెలంగాణ” ఏర్పాటు కావాలన్నా డిమాండ్ ని ప్రస్తావించడంతో మరో సారి ఈ అంశం చర్చల్లోకి వచ్చింది. రెండు తెలుగు రాష్ట్రాలు ఏర్పాటై ఐదేళ్లు పూర్తైన తరుణంలో కాటసాని ప్రస్తావిస్తున్న రాయల తెలంగాణ అంశం రాజకీయంగా పెద్ద దుమారాన్నే రేపుతోంది. స్వంత పార్టీ నుంచి వినిపించిన ఈ రాయల తెలంగాణ ప్రతిపాదన ముఖ్యమంత్రి జగన్ కు కొంత ఎంబర్రస్మెంట్ గానే ఉన్నా.. ప్రస్తుతానికి ముఖ్యమంత్రి ఈ అంశంపై గుంభనంగానే ఉన్నారు. ఈ క్రమంలో తాజాగా తెరమీదికొచ్చిన ఈ అంశంపై కేంద్రంలో అధికారం లో ఉన్న బీజేపీ ఎలా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. తెలుగు రాష్ట్రాల్లో పాగా వేసేందుకు ఉవ్విళ్ళూరుతున్న కమల నాథులు.. తమకు రాజకీయంగా ప్రయోజనకరంగా ఉంటుంది అంటే రాయల తెలంగాణ అంశాన్ని పరిశీలించే అవకాశమూ లేకపోలేదు. ఆంతరంగిక సమావేశాల్లో, సమాలోచనల్లో టిజి వెంకటేష్ లాంటి నేతలు చేస్తున్న నర్మగర్భ వ్యాఖ్యలు రాయల తెలంగాణ వాదనకు బలం చేకూరుసున్నాయి. అయితే ఎటొచ్చి ఈ ప్రతిపాదనను గట్టిగా వ్యతిరేకించే నేతలు రెండు తెలుగు రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా ఉన్న తరుణంలో ఈ ప్రతిపాదన కార్యరూపం దాల్చడం దాదాపు అసాధ్యమే చెప్పాలి.