హైదరాబాద్లో విషాద సంఘటన చోటు చేసుకుంది. మూడేళ్ల కుమారుడిని చంపేసిన ఓ మహిళ అనంతరం తాను కూడా ఆత్మహత్యకు పాల్పడింది. ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ విషాద సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే..
ఎల్బీనగర్ పొలీస్ స్టేషన్ పరిధిలోని శాతవాహన నగర్లో నివసిస్తున్న ఓ వివాహిత ఈ అఘాయిత్యానికి పాల్పడింది. మూడేళ్ల కుమారుడు రియాన్ష్ కుడిచేతిని కత్తితో కోయడంతో తీవ్ర రక్తస్రావమైన బాలుడు మృతి చెందాడు. అనంతరం తాము ఉంటున్న భవనం మూడో అంతస్తుపై నుంచి దూకి తాను కూడా ఆత్మహత్యాయత్నం చేసింది. తీవ్రమైన గాయాలతో ఆమె కూడా అక్కడికక్కడే మరణించింది. సమాచారం అందుకున్న ఎల్బీ నగర్ పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
కాగా, మృతురాలి స్వస్థలం యాదాద్రి జిల్లా వలిగొండ మండలం వర్కట్ పల్లిగా గుర్తించారు. కుటుంబ కలహాల కారణంగా ఆమె ఈ దారుణానికి పాల్పడి ఉంటుదని పోలీసుల అనుమానిస్తున్నారు.