దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన తబ్లీఘీ జమాత్ ( మర్కజ్) మతపరమైన ప్రార్ధనల గురించి తెలిసిందే. కరోనా వైరస్ కేసులు దేశంలో పెరగడానికి ఈ సమావేశాలు కూడా ఓ కారణమన్న.. ఇప్పటికే పలుమార్లు ప్రభుత్వాధికారలే అన్నారు. ఇక ఈ సమావేశాలకు దేశం నలుమూల నుంచే కాకుండా.. విదేశాల నుంచి కూడా వేల సంఖ్యలో హాజరయ్యారు. అయితే వీరిలో పలువురికి కరోనా సోకడం.. వారంతా వారి వారి స్వస్థలాలకు వెళ్లడంతో.. కరోనా వైరస్ అన్ని రాష్ట్రాలకు పాకినట్లైంది. అయితే నిబంధనలకు విరుద్దంగా తబ్లీఘీ జమాత్ సమవేశాలను ఏర్పాటు చేయడమే కాకుండా.. విదేశీయులను కూడా ఈ సమావేశాల్లో పాల్గొనేలా చేయడంతో.. పోలీసులు తబ్లీఘీ జమాత్ చీఫ్ మౌలానా ముహమ్మద్ సాద్పై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
తాజాగా.. ఇప్పడు ఈడీ కూడా రంగ ప్రవేశం చేసింది. తబ్లీఘీ జమాత్ చీఫ్ మౌలానా ముహమ్మద్ సాద్పై ఈడీ మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది. ఢిల్లీ నిజాముద్దీన్లోని ఆరంతస్థుల మర్కజ్ భవనంలో.. గత మార్చి నెలలో మతపరమైన ప్రార్ధనలు నిర్వహించారు. ఈ సమావేశానికి విదేశీయులు కూడా పెద్ద ఎత్తున రావడంతో.. వారి నుంచి ఈ సమావేశానికి వచ్చిన స్వదేశీయులకు చాలా మందికి కరోనా వైరస్ సోకింది. దీంతో ఈ విషయమై ఢిల్లీ పోలీసులు మార్చి 31వ తేదీన ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దీని ఆధారంగా ఈడీ మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది.
కాగా.. కరోనా మహమ్మారిని అరికట్టడంతో భాగంగా.. కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా లాక్డౌన్ విధించింది. అంతకు ముందు ఢిల్లీ ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున జనం గుమికూడవద్దంటూ హెచ్చరికలు జారీచేసింది. అయితే అయినప్పటికీ.. మర్కజ్ బిల్డింగ్లో తబ్లీఘీ జమాత్కు చెందినవారు పెద్ద ఎత్తున ఉన్నారు. దీనిపై నిజాముద్దీన్ పోలీసు స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఫిర్యాదు మేరకు.. తబ్లీఘీ జమాత్ చీఫ్ మౌలానా ముహమ్మద్ సాద్తో పాటు.. మరో ఆరుగురిపై కేసు నమోదైంది.