CM Jagan sensational decision pensions distribution: లాక్ డౌన్ నేపథ్యంలో జనం ఇళ్ళలోంచి బయటికి రాకుండా… ఏమీ పాలు పోకుండా.. దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. అత్యవసరానికి సైతం మనీ సర్దుబాటు కాక సతమతమవుతున్న పేదలు ఎటూ పాలుపోని పరిస్థితిలో పడిపోయారు. ఈ నేపథ్యంలో పెన్షన్లపై సంచలన నిర్ణయం తీసుకున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి.
బడ్జెట్ పాస్ కాకపోవడంతో మూడు నెలల కాలానికి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కోసం ఆర్డినెన్సు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం ముందుగా పెన్షన్లపై సంచలన నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 1వ తేదీన పెన్షనర్లందరి ఇళ్ళ వద్దకే పెన్షన్ మొత్తాలను పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి జగన్ శనివారం సాయంత్రం ఆదేశాలు జారీ చేశారు. దానికి అనుగుణంగా ఈ రెండు రోజుల్లో చర్యలు తీసుకోవాలని, ఎట్టి పరిస్థితుల్లో ఏప్రిల్ ఒకటవ తేదీన పెన్షన్ల పంపిణీ జరగాలని సీఎం చెప్పడంతో అధికారులు ఆగమేఘాల మీద చర్యలు ప్రారంభించారు.
కరోనా వైరస్ కారణంగా ఆదాయం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న సమయంలో పేదలను ఆదుకోవాలని జగన్ ఈ విశేష నిర్ణయం తీసుకున్నారని ప్రభుత్వ వర్గాలంటున్నాయి. పెన్షన్ మొత్తాలను ఏప్రిల్ ఒకటవ తేదీన చెల్లించడంతోపాటు ఇదివరకే సీఎం ఏప్రిల్ 4న ప్రతి నిరుపేద కుటుంబానికి వేయి రూపాయల చొప్పున కరోనా సాయాన్ని పంపిణీ చేయాలని నిర్దేశించారు. ఈ మేరకు గ్రామ వాలంటీర్లు ఆర్థిక సాయాన్ని అందజేస్తారని తెలుస్తోంది.
కరోనా విపత్తులో నిరుపేద కుటుంబాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బాసటగా నిలిచేందుకు పెన్షన్లు సరిగ్గా సమయానికి ఇవ్వడంతోపాటు కరోనా సాయాన్ని కూడా ముందుగా అనుకున్నట్లుగా ఏప్రిల్ నాలుగో తేదీన పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఆదివారం (మార్చి 29) నుంచి ఉచితంగా బియ్యం, కేజీ కంది పప్పు పంపిణీ చేయాలని తలపెట్టారు. ఏప్రిల్ 15న మరోసారి ఉచిత రేషన్, అప్పుడు కూడా ఉచితంగా కేజీ కందిపప్పు పంపిణీ చేస్తారు. ఏప్రిల్ 29న మూడోసారి ఉచితంగా బియ్యం, కేజీ కందిపప్పు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
కేంద్ర ప్రభుత్వ ఆహార భద్రతా పథకంలో లేని కార్డులకు కూడా రేషన్ పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి జగన్ నిర్ణయించారు. ఆమేరకు అదనపు ఖర్చును రాష్ట్ర ప్రభుత్వం భరించనున్నది. కరోనా సమయంలో పేదలెవ్వరికీ ఇబ్బంది రాకుండా పంపిణీకి సమాయత్తం అవుతున్నారు.