కొవిడ్ ప్రభావం తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలపై పడింది. లాక్ డౌన్ నేపథ్యంలో ఈ ఏడాది రాష్ట్రావతరణ వేడుకలను నిరాడంబరంగా జరపాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. తెలంగాణ అమర వీరులకు నివాళులు అర్పించడం, అనంతరం జాతీయ పతాకావిష్కరణ జరపడం మాత్రమే నిర్వహించాలన్నారు. ఎలాంటి సభలు, సమావేశాలు నిర్వహించవద్దని అధికారులకు సూచించారు.
జూన్ 2న ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుగా అమరవీరుల స్థూపానికి నివాళి అర్పించి, అనంతరం ప్రగతి భవన్ లో పతాకావిష్కరణ చేయాలని నిర్ణయించారు. ఇక మంత్రులు, అధికారులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు తమ తమ కార్యాలయాల్లోనే మాత్రమే జాతీయ పతాకావిష్కరణ చేయాలన్నారు సీఎం కేసీఆర్. అటు, అన్ని జిల్లా కేంద్రాల్లో మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు ముందుగా అమరవీరులకు నివాళి అర్పించి, అనంతరం పతాకావిష్కరణ చేస్తారు. జిల్లా కేంద్రంలో నిర్వహించే ఎట్ హోమ్ కార్యక్రమంలో ముఖ్యమైన అధికారులతో మాత్రమే నిర్వహించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు.