AV Subba Reddy comments: బోయినపల్లి కిడ్నాప్ కేసులో మరో కీలక మలుపు.. తనకు ఎలాంటి సంబంధం లేదన్న ఏవీ సుబ్బారెడ్డి
బోయినపల్లి కిడ్నాప్ కేసులో ఏవీ సుబ్బారెడ్డి కీలక నిందితుడని హైదరాబాద్ పోలీసులు తేల్చారు. అయితే, ఈ కేసులో తనకు ఎలాంటి ప్రమేయం లేదంటున్నారు సుబ్బారెడ్డి.
రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలన సృష్టించిన బోయినపల్లి కిడ్నాప్ కేసు మరో కీలక మలుపు తిరిగింది. ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, టీడీపీ నేత భూమా అఖిలప్రియ అరెస్టయిన ఈ వ్యవహారంలో.. ఆమె ప్రత్యర్థి ఏవీ సుబ్బారెడ్డి కీలక నిందితుడని తేలింది. ఆయనను ఎ1గా చేర్చుతూ తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేసినట్లు సీపీ అంజనీ కుమార్ తెలిపారు. అయితే, ఈ కేసులో తనకు ఎలాంటి ప్రమేయం లేదని ఏవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. తనను ఎందుకు ఎ1 చేర్చారో తెలియదని తెలిపారు.
కాగా, ప్రవీణ్ రావు కుటుంబంతో తనకు ఉన్న సంబంధాలు వాస్తవమే.. అయినప్పటికీ కిడ్నాప్ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. హఫీజ్ పేట్ భూమి వివాదం గురించి ఇప్పుడు మాట్లాడలేన్న సుబ్బారెడ్డి.. భూమా అఖిల ప్రియ నన్ను చంపడానికి సుపారి ఇచ్చిందని గతంలో కేసు పెట్టానని అన్నారు. అలాంటి వారితో కలిసి నేనెందుకు కిడ్నాప్ చేస్తానని సుబ్బారెడ్డి ప్రశ్నించారు. ఈ కేసు విషయంలో పోలీసులకు పూర్తిగా సహకరిస్తానని చెప్పారు. ఇదిలావుంటే, భూమా నాగిరెడ్డికి చెందిన పలు బినామీ ఆస్తులు ఏవీ పేరిట ఉన్నట్లు ప్రచారంలో ఉంది. నంద్యాలలో నిప్పూ-ఉప్పులా పోట్లాడుకుంటోన్న ఏవీసుబ్బారెడ్డి-భూమా కుటుంబాలు హఫీజ్ పేట్ భూవ్యవహారంలో కలిసిపోయాయా? రెండు వర్గాలూ కలిసికట్టుగానే కిడ్నాప్కు స్కెచ్ వేశాయా? అన్నదీ ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో హాట్ టాఫిక్గా మారింది.