
ఏపీ నుంచి మరో రెండు హైస్పీడ్ బుల్లెట్ రైళ్ల కారిడార్లు వెళ్లనున్నాయి. అమరావతి టూ చెన్నై, బెంగళూరు కనెక్టివిటీ లభించేలా ఒక ప్రాజెక్ట్ నిర్మించాలని కేంద్ర ప్రభుత్వానికి సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు పంపారు. ఇక మైసూర్-చెన్నై కారిడార్ను నాయుడపేటకు లింక్ చేయాలని ప్రతిపాదించారు. చంద్రబాబు సూచనలతో కేంద్ర ప్రభుత్వం ఆమోదించి వీటిని ప్రాజెక్టులో చేర్చింది. గుంటూరు, చీరాల, నెల్లూరు, నాయుడుపేట, శ్రీసిటీ మీదుగా చెన్నైకి ఒక కారిడార్ నిర్మించాలని సూచించగా.. నాయుడుపేట, తిరుపతి, చిత్తూరు, బంగారుపేట, బెంగళూరు, మాండ్య మీదుగా మైసూర్కు మరో హైస్పీడ్ బుల్లెట్ రైలు కారిడార్ ఉండాలని ప్రతిపాదించారు.
ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఏపీ మీదుగా మూడు బుల్లెట్ రైళ్ల కారిడార్లను నిర్మించాలని ఇటీవల కేంద్ర బడ్జెట్లో పొందుపర్చింది. హైదరాబాద్-చెన్నై, హైదరాబాద్-బెంగళూరు, చెన్నై-హైదరాబాద్ బుల్లెట్ రైల్ కారడార్లు ఏమీ మీదుగా వెళ్లనున్నాయి. వీటికి సంబంధించి అలైన్మెంట్ సిద్దం చేస్తున్నారు. ఆలైన్మెంట్ పూర్తయ్యాక డీపీఆర్ రెడీ చేయనున్నారు. డీపీఆర్ సిద్దమయ్యాక టెండర్లను ఆహ్వానించి పనులను మొదలుపెట్టనున్నారు. వచ్చే ఏడాది ఆగస్ట్ 15న దేశంలో తొలి బుల్లెట్ రైలును ప్రారంభించాలని రైల్వేశాఖ ఇప్పటికే డెడ్ లైన్ పెట్టుకుంది. ఇందుకు సంబంధించి వేగంగా పనులు మొదలుపెడుతోంది. ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ బుల్లెట్ రైలు కారిడార్లో తొలి బుల్లెట్ రైలు ప్రారంభించనున్నారు. ఇక హైదరాబాద్-చెన్నై, హైదరాబాద్-బెంగళూరు కారిడార్లకు సంబంధించి అలైన్మెంట్ సర్వే కూడా కొనసాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి కేంద్రం భూసేకరణ చేపట్టనుంది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వాలతో రైల్వేశాఖ చర్చలు జరుపుతోంది.
కూటమి సర్కార్ అమరావతి అభివృద్ది దృష్టి సారించింది. ఇటీవల పార్లమెంట్లో అమరావతి ఏకైక రాజధానిగా చట్టబద్దత కల్పించారు. బిల్లు పార్లమెంట్లో ఆమోదం పొందటంతో అమరావతిలో పనులను వేగవంతం చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అమరావతి నుంచి రైలు కనెక్టివిటీ ఇతర నగరాలకు ఉండేలా ప్లాన్ చేస్తోంది. బస్సుతో పాటు రైలు కనెక్టివిటీ పెంచేలా అడుగులు వేస్తోంది. అమరావతిని చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ లాంటి నగరాలతో కలిపేలా కనెక్టివిటీ తీసుకురావాలని ప్రణాళికలు రచిస్తోంది. ఆ ప్రణాళికల్లో భాగంగా బుల్లెట్ రైళ్ల కారిడార్లను ప్రతిపాదిస్తోంది. ఇక విజయవాడ-బెంగళూరు హైస్పీడ్ రైలు కారిడార్ను కూడా రైల్వేశాఖ ఇప్పటికే ప్రతిపాదించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం విజయవాడ-విశాఖపట్నం రూట్లో రద్దీ ఎక్కువగా ఉంటుంది. ప్రయాణికుల రద్దీ రైళ్లల్లో ఎక్కువగా ఉంటుంది. దీంతో ఆ మార్గంలో హైస్పీడ్ రైలు కారిడార్ తీసుకొస్తే అమరావతి నుంచి విశాఖ వైపు ప్రయాణం మరింత వేగవంతం అవుతుంది.