
ప్రకాశం జిల్లాలో జాతీయ రహదారిపై పెను ప్రమాదం తప్పింది. కోరిశెపాడు దగ్గర గాజు ఫ్యాక్టరీ సమీపంలో వేగంగా వెళ్తున్న లారీ టైరు పేలడంతో అదుపుతప్పి కాలవలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో డ్రైవర్ లారీ క్యాబిన్లోనే ఇరుక్కుపోయి ప్రాణాపాయ స్థితిలో ఉండగా.. పోలీసులు, ఫైర్ సిబ్బంది సినిమా ఫక్కీలో రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించి అతడిని సురక్షితంగా బయటకు తీశారు. ఈ ఘటన జాతీయ రహదారి 16పై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గుంటూరు నుంచి ఒంగోలు వైపు వేగంగా వెళ్తున్న AP 16 TQ 1599 నంబర్ గల లారీ కోరిశెపాడు దగ్గర గాజు ఫ్యాక్టరీ వద్దకు రాగానే ఒక్కసారిగా టైరు బరస్ట్ అయ్యింది. దీంతో లారీ డ్రైవర్ నియంత్రణ కోల్పోయారు. ముందుగా రోడ్డు మధ్యలో ఉన్న సిమెంట్ దిమ్మెలను బలంగా ఢీకొట్టిన లారీ.. అంతే వేగంతో పక్కనే ఉన్న కాలవలోకి పల్టీ కొట్టింది. ఈ ధాటికి లారీ క్యాబిన్ పూర్తిగా నలిగిపోయింది. డ్రైవర్ బయటకు రాలేని స్థితిలో స్టీరింగ్ మధ్యలో ఇరుక్కుపోయాడు.
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, ఫైర్ సిబ్బంది యుద్ధ ప్రాతిపదికన రంగంలోకి దిగారు. గ్యాస్ కట్టర్లు, క్రేన్ల సహాయంతో సుమారు గంటకు పైగా శ్రమించి క్యాబిన్ను కట్ చేసి డ్రైవర్ను ప్రాణాలతో బయటకు తీశారు. సకాలంలో స్పందించి డ్రైవర్ ప్రాణాలు కాపాడిన పోలీసులను, ఫైర్ సిబ్బందిని స్థానికులు అభినందించారు.
Accident
ఈ ఘటనలో ప్రాణాపాయం తప్పడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఎండాకాలం టైర్లను ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలని.. నిపుణులు సూచిస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..