
Andhra Pradesh Tribal Area: మన్యంలో ఆదివాసీలకు ఆరోగ్య కష్టాలు తప్పడం లేదు. సరైన రోడ్లు లేక.. సకాలంలో ఆసుపత్రికి వెళ్లలేక అష్టకష్టాలు పడుతున్నారు. పురిటి నొప్పులతో బాధపడుతున్న ఓ ఆదివాసి మహిళ.. అతి కష్టం మీద ఆసుపత్రికి చేరింది. ప్రసవం కష్టం కావడంతో.. అక్కడ నుంచి మరో ఆసుపత్రికి రిఫర్ చేశారు వైద్యులు. అంబులెన్స్ ఇచ్చి పంపించారు. అయితే, మార్గమధ్యలోనే ఆమె అంబులెన్స్లోనే ప్రసవించింది. ఆసుపత్రిలో చేయాల్సిన కాన్పు… అంబులెన్స్లో సుఖ ప్రసవం కావడంతో వైద్యులపై వేలెత్తి చూపుతున్నారు గిరిజనులు. తల్లి బిడ్డ క్షేమంగా ఉండడంతో ఊపిరి పీల్చుకున్నారు. సకాలంలో కష్టంలో ఉన్న ఆ మహిళకు సిబ్బంది దగ్గరుండి చూసుకున్నారు.
జి.మాడుగుల మండలం డబ్బాగరువు గ్రామానికి చెందిన గర్భిణి మూవ్వల కూసి నిండు గర్భిణీ. పురిటినొప్పులు రావడంతో కుటుంబసభ్యులు.. 108 వాహనంలో జి.మాడుగుల ప్రాథమిక ఆరోగ్య కేంద్రనికి తరలించారు. అక్కడ వైద్యులు ఆమెకు పరీక్షలు చేశారు. అక్కడ ప్రసవం కష్టంగా ఉందని చెప్పి ఇక్కడ ఆ స్థాయిలో సదుపాయాలు లేవని పాడేరు జిల్లా ఆసుపత్రికి రిఫర్ చేశారు. పీహెచ్సీ నుంచి 108 అంబులెన్స్లో గర్భిణీకి జిల్లా ఆసుపత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యలోనే పురిటినొప్పులు ఎక్కువయ్యాయి. దీంతో అంబులెన్స్ సిబ్బంది బొక్కెళ్లు సమీపంలో ఆమెకు సపర్యలు చేశారు. వాహనంలోనే ఆమె ప్రసవించింది. మగ శిశువుకు జన్మనిచ్చింది మువ్వల కాశి. 108లోనే పాడేరు జిల్లా ఆసుపత్రికి తరలించారు. తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు.