Andhra Pradesh: అంకితభావమే ఆయుధంగా… ఈ ఉపాధ్యాయుడు చేస్తున్న పనికి హ్యాట్సాఫ్..

ఒక ప్రభుత్వ స్కూల్ ఉపాధ్యాయుడు పిల్లలను స్వయంగా తన బైక్‌పై ఎక్కించుకుని స్కూల్‌కి తీసుకెళ్లుతున్నారు. ప్రభుత్వ స్కూల్‌లో విద్యార్థుల సంఖ్య పడిపోతుండటంతో మూసివేసే పరిస్థితులు రాకూడదనే ఉద్దేశంతో ఈ పని చేస్తున్నారు. అంతేకాకుండా విద్యార్థులకు మెరుగైన విద్యను అందిస్తున్నారు. ఈ వివరాలు చూస్తే..

Andhra Pradesh: అంకితభావమే ఆయుధంగా... ఈ ఉపాధ్యాయుడు చేస్తున్న పనికి హ్యాట్సాఫ్..
Parents

Edited By:

Updated on: Jul 23, 2026 | 11:15 AM

ప్రభుత్వ పాఠశాల అంటే చాలు ఒకప్పుడు నాణ్యమైన విద్యకు నిలయం. కానీ కాలక్రమేణా మారుతున్న పరిస్థితులు, తల్లిదండ్రుల్లో ప్రైవేటు పాఠశాలల పట్ల పెరిగిన మక్కువతో సర్కారు బడుల్లో చేరికలు తగ్గిపోయాయి. ఎన్నో పాఠశాలలు మూతపడే దిశగా పయనిస్తున్నాయి. అయితే ఉపాధ్యాయుడికి బోధన కేవలం ఉద్యోగం మాత్రమే కాదు, అదొక సామాజిక బాధ్యత అని నిరూపిస్తున్నారు పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరుకు చెందిన మండల పరిషత్ ఉపాధ్యాయుడు సీహెచ్ సూర్యప్రకాష్. ఆయన చూపిస్తున్న నిబద్ధత, అంకితభావం మూతపడే స్థితికి చేరిన ప్రభుత్వ బడులకు నూతన ఉత్తేజాన్ని ఇస్తున్నాయి.

గతంలో మొగల్తూరు పంచాయతీ పరిధిలోని నల్లంవారితోట పాఠశాలలో పనిచేస్తున్న సమయంలో విద్యార్థుల సంఖ్య దారుణంగా పడిపోయింది. దీంతో బడిని శాశ్వతంగా మూసివేసే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆ క్లిష్ట సమయంలో సూర్యప్రకాష్ వెనకడుగు వేయలేదు. తాను అంతకుముందు పనిచేసిన వారతిప్ప గ్రామం నుంచి దాదాపు పదిమంది విద్యార్థులను నిత్యం తన సొంత ద్విచక్రవాహనంపైనే విడతల వారీగా బడికి తీసుకురావడం ప్రారంభించారు. సాయంత్రం పాఠశాల వేళలు పూర్తయ్యాక మళ్లీ వారందరినీ సురక్షితంగా ఇళ్లకు చేర్చే బాధ్యతను ఆయనే స్వయంగా భుజస్కంధాలపై వేసుకున్నారు. విద్యార్థులపై ఆయన చూపిన ఆత్మీయత, రవాణా సౌకర్యాన్ని ఉచితంగా కల్పించడం తల్లిదండ్రుల్లో కొత్త నమ్మకాన్ని చిగురింపజేసింది.

ప్రస్తుతం ఆయన మొగల్తూరు గ్రామ పంచాయతీ పరిధిలోని నక్కావారిపాలెం ప్రాథమిక పాఠశాలలో విధులను నిర్వర్తిస్తున్నారు. ఇక్కడ కూడా అదే బాధ్యతారాహిత్యాన్ని జయించేందుకు శ్రమిస్తున్నారు. మొగల్తూరు సెంటర్లోని తన ఇంటి సమీపంలో ఉండే నలుగురు విద్యార్థులను ప్రతిరోజూ తన బైక్‌పైనే పాఠశాలకు తీసుకెళ్తూ, తిరిగి ఇళ్లకు చేరుస్తున్నారు. సూర్యప్రకాష్ అందిస్తున్న నాణ్యమైన బోధన, విద్యార్థుల పట్ల ఆయనకు ఉన్న ఆపేక్షను గమనించిన తల్లిదండ్రులు ఇప్పుడు తమ పిల్లలను నిరభ్యంతరంగా ప్రభుత్వ పాఠశాలలో చేర్పించేందుకు ముందుకు వస్తున్నారు. ఉపాధ్యాయుడు మనస్ఫూర్తిగా తలచుకుంటే ఏ ప్రభుత్వ పాఠశాలా మూతపడదని, సర్కారు బడుల భవిష్యత్తు ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉందనడానికి సూర్యప్రకాష్ కృషి ప్రత్యక్ష నిదర్శనంగా నిలుస్తోంది.

Follow Us