
ఏపీలోని ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉపఎన్నికలో టీడీపీ గెలుపొందింది. టీడీపీ అభ్యర్థి ముద్దుకృష్ణారెడ్డి 6267 ఓట్లతో విజయం సాధించారు. టీడీపీ అభ్యర్థి ముద్దుకృష్ణారెడ్డికి 12,780 ఓట్లు రాగా.. వైసీపీ అభ్యర్థి సుబ్బారెడ్డికి 6513 ఓట్లు వచ్చాయి. దీంతో టీడీపీ నాయకులు సంబరాలు చేసుకున్నారు. పటాకులు, స్వీట్లు పంచుకున్నారు. అంతకుముందు పులివెందులలోనూ టీడీపీ విజయకేతనం ఎగురవేసింది. దాదాపు 6వేల 52 ఓట్ల మెజార్టీతో టీడీపీ అభ్యర్థి లతారెడ్డి ఘన విజయం సాధించారు. ఈ ఎన్నికలో టీడీపీకి 6735 ఓట్లు వచ్చాయి. వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డికి కేవలం 683 ఓట్లు వచ్చాయి. దీంతో వైసీపీ డిపాజిట్ కోల్పోయింది. ఈ స్థానంలో మొత్తం 10వేల601 ఓట్లు ఉండగా.. 7814 ఓట్లు పోల్ అయ్యాయి. సొంత ఇలాకాలో వైసీపీ ఓటమి జగన్కు షాక్ అని చెప్పొచ్చు.
కాగా 30 ఏళ్ల తర్వాత పులివెందుల జడ్పీ పీఠం టీడీపీ కైవసం చేసుకుంది. 2016 కంటే ముందు ఐదుసార్లు వైఎస్ ఫ్యామిలీ నిలబెట్టిన అభ్యర్థే ఏకగ్రీవంగా ఎన్నికవుతూ వచ్చారు. ఇక 2016 జడ్పీటీసీ ఎన్నికలో టీడీపీ అభ్యర్థి నామినేషన్ తర్వాత వైసీపీలో చేరారు. అయితే బ్యాలెట్ పేపర్లో సైకిల్ గుర్తు ఉండడంతో దానికి 2500 ఓట్లు పడడం గమనార్హం.
ఈ జడ్పీటీసీ ఎన్నికలను టీడీపీ -వైసీపీ పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. గెలుపు కోసం వ్యూహ ప్రతివ్యూహాలను రచించాయి. ఈ ఎన్నికలు ఒక మినీ సంగ్రామాన్ని తలపించాయి. పులివెందులలో గొడవలు, అరెస్టులు, రీపోలింగ్ వంటివి జరిగాయి. చివరకు రెండు స్థానాలను టీడీపీ కూటమి కైవసం చేసుకుంది.