
జంతు కళేబరాయిల్ తయారీపై టీవీ 9 వరుస కథనాలతో రాజమండ్రి ఫుడ్ సేఫ్టీ అధికారులు అలర్ట్ అయ్యారు. రాజమండ్రిలోని 30 స్వీట్ షాపులు, బేకరీలు, హోటల్స్ తనిఖీల్లో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. కుళ్లిపోయిన మాంసం.. గడువు ముగిసిన అల్లం, వెల్లుల్లి పేస్టులు, అడ్డదిడ్డమైన ఆయిల్స్, డేంజర్ కెమికల్స్.. ఇవీ.. రాజమండ్రి ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడుల్లో బయటపడ్డ విషయాలు..
రాజమండ్రిలో జంతువుల కొవ్వు నుంచి ఆయిల్స్ తయారీ కేంద్రాల బాగోతాన్ని టీవీ9 బట్టబయలు చేయడంతో ఫుడ్ సేఫ్టీ అధికారులు, లీగల్ మెట్రాలజీ అధికారులు రెండు రోజుల నుంచి ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నారు. రాజమండ్రి నగరంలోని హోటళ్లు, రెస్టారెంట్లపై లీగల్ మెట్రాలజీ, ఫుడ్ సేఫ్టీ అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. రెండు రోజుల్లో 30 విక్రయ కేంద్రాల్లో దాడులు చేసి.. నిబంధనలు ఉల్లంఘించినవారిపై కేసులు నమోదు చేశారు.
ప్రధానంగా.. హోటల్స్, రెస్టారెంట్లు, బిర్యానీ సెంటర్లు, స్వీట్ షాపులు, స్వీట్ తయారీ కేంద్రాలు, బేకరీల్లో తనిఖీలు చేపట్టారు. ఈ దాడుల్లో 62 వేలు విలువ చేసే 174 కిలోల కుళ్లిపోయిన మాంసం, మసాలా పేస్టు, చట్నీలతోపాటు.. ఆహార పదార్థాలను ధ్వంసం చేశారు. చికెన్ బిర్యానీలు, చికెన్ ఫ్రైల కోసం వాడే నూనెల్లో జంతువుల కొవ్వు నుంచి తీసిన నూనెలు ఉన్నాయనే అనుమానంతో శాంపిల్స్ సేకరించి.. హైదరాబాద్లోని ల్యాబ్కు పంపారు. స్వీట్స్ తయారీలో కృత్రిమ రంగుల వాడకంతోపాటు.. గడువు ముగిసిన ఆహార పదార్థాలు, పాడైపోయిన గుడ్లు, బేకరీల్లోని డేంజర్ కెమికల్ ఐటమ్స్ను స్వాధీనం చేసుకున్నారు. న్యూస్ పేపర్లతో బ్రెడ్, కేక్లు తయారు చేస్తున్నట్లు గుర్తించి సీజ్ చేశారు. ల్యాబ్కు పంపిన శాంపిల్స్లో హానికర కెమికల్స్ ఉన్నట్లయితే నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
వీడియో ఇక్కడ చూడండి..
మరిన్ని అంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..