Weather Report: తెలుగు రాష్ట్రాల్లో హీట్ వేవ్.. ఈ జిల్లాలకు వడగాల్పుల హెచ్చరిక.. ఆరెంజ్ అలర్ట్ జారీ

ఏపీ, తెలంగాణలో ఎండ తీవ్రత పెరుగుతోంది. జనాలు బయటకు రావాలంటేనే భయపడే పరిస్థితులు నెలకొన్నాయి. ఉదయం 7 గంటల నుంచే ఎండ ప్రభావం, ఉక్కబోత మొదలవుతోంది. దీంతో జనం అల్లాడిపోతున్నారు. మరికొద్ది రోజుల పాటు భానుడి తీవ్రత అలాగే కొనసాగే అవకాశముంది.

Weather Report: తెలుగు రాష్ట్రాల్లో హీట్ వేవ్.. ఈ జిల్లాలకు వడగాల్పుల హెచ్చరిక.. ఆరెంజ్ అలర్ట్ జారీ
Summer Heatwave in AP and Telangana

Updated on: Apr 11, 2026 | 7:12 AM

ఎండ తీవ్రత, వడగాల్పులపై ఏపీ ప్రజలకు వాతావరణశాఖ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్రంలో వాతావరణ పరిస్ధితులపై ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖన్ జైన్ ప్రకటన జారీ చేశారు. ఏప్రిల్ 11వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా భానుడి ప్రతాపం, వడగాల్పులు తీవ్ర స్థాయిలో ఉండే అవకాశముందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. శనివారం ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమలో వేడి గాలులు బలంగా వీసే అవకాశముందని, గరిష్ట ఉష్ణోగ్రతలు తారాస్థాయిలో నమోదవుతాయని అంచనా వేశారు. కాకినాడ జిల్లాలోని 2, తూర్పుగోదావరి జిల్లాలో 4, ఎన్టీఆర్ జిల్లాలో 3, ఏలూరు జిల్లాలో 3, అనకాపల్లి జిల్లాలో 5, పోలవరం జిల్లాలో 6, పార్వతీపురం మన్యం జిల్లాలో 14, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 1, విజయనగరం జిల్లాలో 20, శ్రీకాకుళం జిల్లాలో 8 మండలాల్లో వడగాలులు వీస్తాయని హెచ్చరించారు.

వడగాల్పుల హెచ్చరికలు జారీ

ఇక ఎన్టీఆర్ జిల్లాలో 3 మండలాల్లో వడగాల్పులు ఇవాళ వీస్తాయని, ఇక 79 మండలాల్లో వీటి ప్రభావం ఉంటుందని వాతావరణశాఖ తెలిపింది. ఇక ఆదివారం 93 మండలాల్లో వడగాల్పుల తీవ్రత కొనసాగుతుందని స్పష్టం చేసింది. ఇక శుక్రవారం ఉష్ణోగ్రతల విషయానికొస్తే.. కాకినాడ జిల్లా కరపలో 44.1 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదవ్వగా.. కడపలో 43.6 డిగ్రీల ఉష్ణోగ్రత, పశ్చిమగోదావరి జిల్లా పోడూరులో 42.9 డిగ్రీల ఉష్ణోగ్రత, తిరుపతి జిల్లాలోని వరదయ్యపాలెంలో 42.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణశాఖ వివరాలు వెల్లడించింది. ఇక రాష్ట్రంలోని 22 జిల్లాల్లో 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అటు నేడు ఏపీలోని విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, విజయనగరం జిల్లాలో పిడుగులతో కూడిన తేలికపాటి వానలు పడతాయని అంచనా వేసింది.

తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్

ఇక తెలంగాణలో రాబోయే మూడు నుంచి నాలుగు రోజుల పాటు ఎండ తీవ్రత పెరిగే అవకాశముందని ఈ మేరకు హైదరాబాద్ వాతావరశాఖ తెలిపింది. ఈ మేరకు పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఉష్ణోగ్రతలు 41 నుంచి 44 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదవుతాయని అంచనా వేసింది. పలు జిల్లాల్లో ఇప్పటికే గరిష్ట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకుపైగా నమోదయ్యాయి. ఇక నిజామాబాద్, ఆదిలాబాద్, నల్లగొండ, ఖమ్మం, ఆదిలాబాద్, మహబూబ్ నగర్ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతాయని వాతావరణశాఖ అధికారులు పేర్కొన్నారు. ఎండల క్రమంలో మధ్యాహ్నం వేళల్లో వృద్దులు, పిల్లలు బయటకు రాకపోవడం మంచిదని సూచించింది. అత్యవసరమై బయటకు వస్తే పలు జాగ్రత్తలు పాటించాలని సూచించింది.  గర్బిణులు కూడా జాగ్రత్తలు పాటించాలని, వడదెబ్బ బారిన పడకుండా తగిన సూచనలు పాటించాలని సూచించింది. కాగా తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే ఎండలు దంచికొడుతుండగా.. రానున్న మరికొద్ది రోజుల్లో మరింత పెరిగే అవకాశముంది.

Follow Us