
సరదాగా విహారయాత్రకు వెళ్లిన యువతులు జలపాతం వల్ల సెల్ఫీ తీసుకుంటూ ప్రమాదవశాత్తు నీటిలో పడిపోయి మృతి చెందిన ఘటన పాడేరు ఎజెన్సీలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. హుకుంపేట మండలం బూర్జ పంచాయితీ జుంభువలస గ్రామానికి చెందిన సాలెపు త్రిష, సాలెపు రత్నకుమారి, సాలెపు పవిత్ర ,సాలేపు అంజలి అక్కా చెల్లెలు. వీరిలో త్రిష ఇటీవలే హుకుంపేటలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ పూర్తి చేసుకోగా.. రత్నకుమారి టెన్త్ క్లాస్ చదవుతోంది. ఇక పవిత్ర ఇంటి దగ్గరే పేరెంట్స్తో కలిసి ఉంటుంది.
అయితే ఇటీవలే ఇంటర్ పూర్తి చేసుకొని ఇంటికి వచ్చిన త్రిష.. రత్నకుమారి, పవిత్ర, అంజలితో కలిసి అనంతగిరి – హుకుంపేట మండలాల సరిహద్దులో ఉన్న వాలసి పంచాయితీ మల్లుంగుమ్మి జలపాతం చూసేందుకు వెళ్లారు. ఓవైపు జలపాతం మరోవైపు పచ్చని ప్రకృతి వారిని ఆకర్షించడంతో అందరూ కలిసి సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు జారి జలపాతంపై నుంచి పడిపోయారు. ఈ క్రమంలో కాపాడాలంటూ కేకలు వేశారు. అది విన్న స్థానిక రైతులు వెంటనే జలపాతం వద్దకు చేరుకున్నారు.
కానీ ఎత్తైన ప్రదేశం నుంచి పడిపోవడం, అక్కడున్న ఎవరికీ ఈత రాకపోవడంతో త్రిష, రత్నకుమారి, పవిత్ర ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. కేవలం అంజలిని మాత్రమే స్థానికులు ప్రాణాలతో కాపాడగలిగారు. వెంటనే అంజలిని చికిత్స నిమిత్తం హాస్పిటల్కు తరలించారు. ఇక ప్రాణాలు కోల్పోయిన ముగ్గురు మృతదేహాలను వెళికి తీసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాధితుల కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.