PM Modi: అరకు వ్యాలీకి మరో అరుదైన గుర్తింపు.. తొలి మన్ కీ బాత్‎లో ప్రధాని మోదీ..

మన అరకు కాఫీకి దేశ ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా బ్రాండ్ అంబాసిడర్‎గా మారారు. అవకాశం దొరికినప్పుడల్లా అరకు కాఫీని గుర్తు తెచ్చుకుంటారు ఆయన. హ్యాట్రిక్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తరువాత తొలి మన్ కీ బాత్‎లో మరోమారు అరకు కాఫీని ప్రశంసించారు. ఈ సందేశం అరకు వ్యాలీని మరోసారి ఆనందోత్సాహాలలో నింపింది. కేవలం ప్రశంసలు మాత్రమే కాదు.. అరకు కాఫీ రుచిని ఆస్వాధించమని మన్ కి బాత్ శ్రోతలను కూడా కోరారు ప్రధాని మోడీ.

PM Modi: అరకు వ్యాలీకి మరో అరుదైన గుర్తింపు.. తొలి మన్ కీ బాత్‎లో ప్రధాని మోదీ..
Pm Modi
Follow us

| Edited By: Srikar T

Updated on: Jun 30, 2024 | 5:45 PM

మన అరకు కాఫీకి దేశ ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా బ్రాండ్ అంబాసిడర్‎గా మారారు. అవకాశం దొరికినప్పుడల్లా అరకు కాఫీని గుర్తు తెచ్చుకుంటారు ఆయన. హ్యాట్రిక్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తరువాత తొలి మన్ కీ బాత్‎లో మరోమారు అరకు కాఫీని ప్రశంసించారు. ఈ సందేశం అరకు వ్యాలీని మరోసారి ఆనందోత్సాహాలలో నింపింది. కేవలం ప్రశంసలు మాత్రమే కాదు.. అరకు కాఫీ రుచిని ఆస్వాధించమని మన్ కి బాత్ శ్రోతలను కూడా కోరారు ప్రధాని మోడీ.

మన్ కీ బాత్‎లో ప్రధాని మోడీ ఏమన్నారంటే..

అరకు వ్యాలీలో పండే కాఫీ స్థాయిని ప్రపంచ వ్యాప్తంగా విస్తృతం చేయడంలో గిరిజన సహాకార సంస్థ (జిసిసి) కీలక పాత్ర పోషిస్తున్నదని ప్రధాని మోదీ అన్నారు. ఆదివారం నాడు మన్ కి బాత్ కార్యక్రమంలో దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ.. అల్లూరి జిల్లా మన్యం ప్రాంతంలో గిరిజన సహకార సంస్థ, ఏపీ ప్రభుత్వ సహకారంతో గిరిజనులు సాగు చేస్తున్న అరకువ్యాలీ కాఫీ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. మన దేశంలో స్థానిక ఉత్పత్తులు ప్రపంచ స్థాయి గుర్తింపును సాధిస్తుండడం భారతీయులంతా గర్వించదగ్గ విషయమని ఆయన అన్నారు. అలాంటి ఉత్పత్తుల్లో అరకువ్యాలీ కాఫీ ప్రధమ శ్రేణిలో వుంటుందని కొనియాడారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో అరకు కాఫీని గిరిజనులు అధిక విస్తీర్ణంలో సాగు చేస్తున్నారని, శ్రేష్టమైన అరోమా రుచి గల అరకు కాఫీకి మంచి గుర్తింపు ఉందని అన్నారు. 1 లక్షా 50 వేల మంది ఆదివాసీ కుటుంబాలు అరకు కాఫీ సాగు, ఉత్పత్తి, విక్రయాలతో ఆర్ధిక సాధికారత సాధిస్తున్నారని వివరించారు. కాఫీకి గ్లోబల్ గుర్తింపు తీసుకురావడంలో విశేషమైన కృషి చేస్తున్న గిరిజన సహకార సంస్థ (జిసిసి) ఆదివాసీ రైతు సోదర, సోదరీమనులను ఒక తాటిపైకి తీసుకువచ్చి, కాఫీ సాగుకు ప్రోత్సహిస్తున్నదని కీర్తించారు. ఈ ప్రక్రియలో గిరిజనుల ఆదాయం గణనీయంగా పెరగడంతో పాటు గౌరవనీయమైన జీవనాన్ని సాగించేందుకు దోహదపడుతుందన్నారు

చంద్రబాబుతో అరకు కాఫీ తాగా.. మోడీ:

గతంలో విశాఖపట్నం సందర్శించినపుడు నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి అరకు కాఫీని ఆస్వాధించే అవకాశం లభించిందని ప్రధాని మోడీ మన్ కి బాత్ లో గుర్తు చేసుకున్నారు. ఈ విషయాన్ని తన ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు. అప్పట్లో చంద్రబాబుతో కలిసి కాఫీ తాగుతున్న ఫోటోలను కూడా ప్రదర్శించారు. అరకు కాఫీ రుచి గురించి చెప్పాల్సిన అవసరంలేదనీ.. అద్భుతంగా వుందన్నారు. అరకు కాఫీకి ప్రపంచస్థాయి అవార్డులు ఎన్నో వచ్చాయని తెలిపారు. ఢిల్లీలో జరిగిన జి 20 సమ్మిట్‎లో కూడా అరకువ్యాలీ కాఫీకి ప్రాచుర్యం లభించిందన్నారు.

ప్రధానితో మరో కప్పు అరకు కాఫీ తాగేందుకు సిద్ధం.. చంద్రబాబు:

మన్ కి బాత్‎లో చెప్పడమే కాకుండా ఇదే అంశంపై ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. మోడీ ట్వీట్‎కు రిప్లై ఇచ్చిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరకు కాఫీని మన గిరిజన సోదరీమణులు ప్రేమ, భక్తితో పండిస్తార తెలిపారు. ఇది స్థిరమైన గిరిజన సాధికారత, ఆవిష్కరణల సమ్మేళనాన్ని సూచిస్తుందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. దీన్ని మన్ కి బాత్‎లో భాగస్వామ్యం చేసినందుకు మోడీకి ధన్యవాదాలు తెలిపారు. మేడ్ ఇన్ AP ఉత్పత్తిని ఆమోదించినందుకు కృతజ్ఞతలు చెబుతూ మీతో మరో కప్పు అరకు కాఫీ ఆనందించడానికి ఎదురు చూస్తున్నానన్నారు ఏపీ సీఎం చంద్రబాబు.

గిరిజనుల ఆర్ధిక సాధికారతకు ఊతం : జిసిసి

అల్లూరి జిల్లాలో అరకు వ్యాలీ సాగు, గిరిజనులకు రాష్ట్ర ప్రభుత్వం, జిసిసి అందిస్తున్న ప్రోత్సాహాన్ని ప్రధానినరేంద్ర మోదీ మన్ కి బాత్‎లో ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఇలా చెప్పడం గర్వంగా వుందని జిసిసి వైస్ చైర్మెన్ & మేనేజింగ్ డైరెక్టర్ జి. సురేష్ కుమార్ అన్నారు. ప్రధాని స్ఫూర్తివంతమైన వ్యాఖ్యలు.. గిరిజన కాఫీ రైతులకు, జిసిసి సిబ్బందికి, కాఫీ సాగుతో ముడిపడి వున్న అన్ని ప్రభుత్వ శాఖల సిబ్బంది ప్రశంసనీయం అన్నారు. చాల మందికి ఎంతగానో ఉత్తేజాన్ని, ఉత్సాహాన్ని, ప్రోత్సాహాకాన్ని ఇస్తుందని తెలిపారు. గిరిజనుల ఆర్ధిక సాధికారతకు అరకు కాఫీ ఎంతగానో ఊతమిస్తున్నదన్నారు సురేష్ కుమార్.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..