
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మరోసారి పరామర్శకు బయల్దేరుతున్నారు. మొన్న అంబటి రాంబాబు ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన జగన్.. ఇప్పుడు జోగి రమేష్ ఇంటికి వెళ్తున్నారు. ఇటీవల టీడీపీ అభిమానుల దాడిలో ఇల్లు ధ్వంసం కావడం.. ఆ సమయంలో కొందరు కుటుంబ సభ్యుల ఇంట్లోనే ఉండడంతో పెద్ద వివాదమే చెలరేగింది. అయితే జో గిరమేష్ ఇంటిపై దాడిని ఖండించిన వైఎస్ జగన్.. ఇవాళ ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించడానికి సిద్ధమయ్యారు. దీనికోసం వైసీపీ రూట్ మ్యాప్ రెడీ చేసింది. తాడేపల్లి నివాసం దగ్గర్నుంచి బయల్దేరి.. కనకదుర్గ వారధి, బస్టాండ్, భవానీపురం, గొల్లపూడి, గుంటుపల్లి, తుమ్మలపాలెం ద్వారా ఇబ్రహీంపట్నం వెళ్లి జోగిరమేష్ ఇంటిని పరిశీలించి కుటుంబ సభ్యులను పరామర్శించాలని రెడీ అయ్యారు.
బైరోడ్ ద్వారా వెళ్లి పరామర్శించాలని నిర్ణయం తీసుకున్నారు జగన్. అయితే పోలీసులు మాత్రం జగన్ రూట్ మ్యాప్ను ఒప్పుకోవడం లేదు. ఇటీవల జగన్ పరామర్శల సమయంలో పెద్ద ఎత్తున జనం వస్తున్నారని.. దీనివల్ల సామాన్యులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారంటూ పోలీసులు ఓ నోట్ విడుదల చేశారు. వైసీపీ చెబుతున్న రూట్ మ్యాప్లో ఇరుకైన ప్రదేశాలు ఉన్నాయని.. అక్కడి నుంచి వెళ్తే తొక్కిసలాంటి పరిస్థితులు ఏర్పడుతుందంటున్నారు పోలీసులు. అంతేకాదు భారీఎత్తున ట్రాఫిక్ జాం అవడం, సాధారణ పౌరులకు ఇబ్బందులు కలుగుతాయన్న కారణాలు చూపిస్తు పోలీసులే కొత్త రూట్ మ్యాప్ ఇచ్చారు. వారధి మీదుగా కాకుండా వెస్ట్ బైపాస్ మీదుగా జోగి రమేష్ నివాసానికి వెళ్లాలని మాజీ సీఎంకు నోటీసులు జారీ చేశారు పోలీసులు.
జగన్ పర్యటన తాడేపల్లి నుంచి.. వెస్ట్ బైపాస్ మీదుగా.. నల్లకుంట, గుంటుపల్లి, తుమ్మలపాలెం, ఇబ్రహీంపట్నం వెళ్లాలని చెబుతున్నారు పోలీసులు. అయితే కాసేపట్లో మొదలు కాబోయే జగన్ పర్యటన ఎటువైపు నుంచి సాగుతుందనేది ఆసక్తికరంగా మారింది. ఇటీవల గుంటూరులోని అంబటి రాంబాబు ఇంటికి వెళ్లే సమయంలో 50 కిలోమీటర్లు కూడా లేని పర్యటన ఉదయం నుంచి సాయంత్రం వరకు వరకు సాగడం.. ఆ సమయంలో హైవేపై ట్రాఫిక్ జాం అవడాన్ని పోలీసులు ప్రస్తావిస్తున్నారు. జగన్ విజయవాడలోపలి నుంచి కాకుండా.. వెస్ట్ బైపాస్ ఉపయోగించుకుని వెళ్లారావాలంటున్నారు పోలీసులు. మరోవైపు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా.. జన సమీకరణ చేయొద్దంటూ ఎన్టీఆర్ జిల్లా వైసీపీ నేతలకు సైతం పోలీసులు నోటీసులు జారీ చేశారు.