
మానవ సేవయే.. మాధవ సేవ అన్న సత్యసాయి బాబా ప్రేమ సూత్రాలు ప్రపంచం మొత్తం వినిపిస్తున్నాయని భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తిలో నిర్వహించిన సత్యసాయి బాబా శత జయంత్యుత్సవాలకు ప్రధాని మోదీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సత్యసాయి జయంత్యుత్సవాల్లో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. విశ్వప్రేమకు ప్రతిరూపంగా సత్యసాయి బాబా నిలిచారన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో ఆధ్యాత్మిక శోభ కనిపిస్తోంది. శ్రీ సత్యసాయి బాబా శతజయంతి ఉత్సవాలు ఇవాళ్టి నుంచి 23 వరకు ఘనంగా జరగనున్నాయి. పుట్టపర్తి పురవీధులు సాయి నామస్మరణతో మార్మోగుతున్నాయి. ఈ కార్యక్రమాలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
సత్యసాయి బోధనలు ప్రపంచానికి సన్మార్గం చూపాయని ప్రధాని మోదీ అన్నారు. ‘అందరినీ ప్రేమించు.. అందరినీ సేవించు’.. ఇదే ఆయన నినాదం.. వేలాది జీవితాలను మార్చేసిందన్నారు. ప్రజల కోసం ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టిన ఆయన స్పూర్తి.. లక్షల మందిని సేవా మార్గంలో మళ్లించిందన్నారు. సమాజ సేవకు అధిక ప్రాధాన్యత ఇచ్చిన సత్యసాయి.. తాగునీరు, విద్య, వైద్యం వంటి రంగాల్లో విశిష్ట సేవలు అందించారని ప్రధాని మోదీ గుర్తు చేశారు. పుట్టపర్తి పవిత్ర భూమిలో ఏదో మహత్తు ఉందన్న ప్రధాని.. సత్యసాయి స్థాపించిన సంస్థలన్నీ ప్రేమను పంచుతూ వర్థిల్లాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు. ఈ సందర్భంగా సత్యసాయి స్మారకార్థంగా రూపొందించిన రూ.100 నాణెం, 4 తపాలా బిళ్లలను ప్రధాని మోదీ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్, క్రికెటర్ సచిన్, సినీ నటి ఐశ్వర్య రాయ్ తదితరులు పాల్గొన్నారు
అంతకుముందు పుట్టపర్తి విమానాశ్రయంలో ల్యాండ్ అయిన మోదీకి గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, స్వాగతం పలికారు. ఎయిర్పోర్ట్ నుంచి కాసేపట్లో ప్రధాని సత్యసాయి బాబా మహాసమాధికి రోడ్డు మార్గాన చేరుకున్నారు. శ్రీసత్యసాయి బాబా మహాసమాధిని దర్శించుకున్న ప్రధాని మోదీ, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం, రైతులకు అందించే గోదాన కార్యక్రమంలో భాగంగా నలుగురు రైతులకు గోవులను దానం చేశారు. ఆ తర్వాత సాయి కుల్వంత్ సభా మందిరంలో ప్రధాని మోదీకి వేద పండితులు వేదాశీర్వచనం అందించారు. హిల్ వ్యూ స్టేడియంలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలను ప్రధాని తిలకించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..