Chilli Prices: మిర్చి రైతుకు నష్టాల ఘాటు.. రోజురోజుకూ ధరలు పతనం.. ప్రస్తుతం ఇలా
అమ్మబోతే అడవి.... కొనబోతే కొరివి.... అన్నచందంగా మారింది మిర్చి రైతుల పరిస్థితి. మార్కెట్లో ధరలు ఆశాజనకంగా ఉన్నాయని కోటి ఆశలతో పంటను అమ్ముకునేందుకు వచ్చిన అన్నదాతలు.. చివరికి కన్నీరు పెడుతున్నారు. పంట రానంత వరకు ఊరించిన మద్దతు ధర... మిర్చి రాకతో అమాంతం పడిపోయాయి. ప్రస్తుతం ఎర్ర బంగారం ధరలు నేల చూపులు చూస్తుండటంతో రైతన్నలు దిగులు పడుతున్నారు.
![Chilli Prices: మిర్చి రైతుకు నష్టాల ఘాటు.. రోజురోజుకూ ధరలు పతనం.. ప్రస్తుతం ఇలా](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/06/mirchi-price.jpg?w=1280)
గతేడాది మిర్చికి డిమాండ్ ఉండడంతో రైతులు ఈ ఏడాది సాగు విస్తీర్ణం పెంచారు. మంచి ధర వస్తే నాలుగు రూపాయలు మిగులుతాయని ఆశించి పెట్టుబడి కోసం అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి సాగు చేశారు. ప్రకృతి ఒడిదుడుకులను ఎదుర్కొని పంటలను సాగు చేస్తే…. చివరికి నష్టాల ఘాటు మిగులుతోంది. సీజన్లో ఆశాజనకంగా ఉన్న మిర్చి ధరలు వేసవి సెలవుల అనంతరం నేలచూపు చూస్తున్నాయి. అటు వ్యాపారులు, ఇటు రైతులు ఊహించని విధంగా ధరలు తగ్గుతున్నాయి. విదేశాలతో పాటు దేశీయంగానూ ఎగుమతులు నిలిచిపోవడంతో ఆ ప్రభావం మిర్చి ధరలపై పడింది. ఫలితంగా క్రయవిక్రయాలు మందగిస్తున్నాయి. ధరలు తగ్గుముఖం పడుతుండటంతో రైతులు వేచిచూసే ధోరణి అవలంబిస్తున్నారు.
గత ఏడాదితో పోల్చితే క్వింటాకు నాలుగైదు వేల రూపాయల వరకు తేడా వస్తుండటంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేసవికి ముందు తేజ రకం క్వింటాల్ ఇరవై ఆరు వేల రూపాయల వరకు ధర పలికింది. సాధారణ వెరైటీలు ఇరవై వేల రూపాయల ధర పలికాయి. అయితే చాలా వరకు రైతులు తమ మిర్చిని అమ్మకుండా శీతల గిడ్డంగుల్లో నిల్వ చేసుకున్నారు. దీంతో గుంటూరు మిర్చి యార్డు సమీపంలోని అన్ని కోల్డ్ స్టోరేజ్లో మిర్చి నిల్వలతో నిండుకున్నాయి. సమ్మర్ తర్వాత అధిక ధరలు వస్తాయని రైతులు భావించారు. అంతేకాకుండా వ్యవసాయ సీజన్ ప్రారంభ సమయంలో పంటను విక్రయించుకుంటే తిరిగి పెట్టుబడికి ఇబ్బంది లేకుండా ఉంటుందని ఆశించారు. అయితే ప్రస్తుతం ధరలు చూసి కోల్డ్ స్టోరేజ్లో దాచుకున్న ప్రయోజనం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం తేజ వెరైటీ క్వింటాలు ఇరవై వేలు పలుకుతోంది. సాధారణ వెరైటీలు పన్నెండు వేల రూపాయల నుండి పదిహేను వేల రూపాయల ధర మాత్రమే పలుకుతున్నాయి. దీంతో ప్రస్తుత ధరలు నిరాశాజనకంగా ఉన్నాయంటున్నారు రైతులు. గత మూడు నెలలుగా శీతల గిడ్డంగుల్లో పెట్టిన ఖర్చులు కూడా రావడం లేదంటున్నారు. ఎగుమతులు తగ్గడంతో పాటు మిర్చి నిల్వలు కూడా అధికంగా ఉండటం ధరలు తగ్గడానికి కారణమంటున్నారు.
ప్రస్తుతం కొనుగోళ్లు పెద్దగా లేకపోవడంతో ధరలు ఆశాజనకంగా లేని మాట వాస్తవమేనని మిర్చి యార్డు కార్యదర్శి వెంకటేశ్వరరెడ్డి చెప్పారు. అయితే నాణ్యమైన మిర్చికి మంచి రేటే ఉందన్నారు. బంగ్లాదేశ్, చైనా దేశాలకు ఎగుమతులు తగ్గడంతో మార్కెట్లో స్తబ్ధత నెలకొందన్నారు. మొత్తంగా రోజురోజుకు దిగజారుతున్న ధరలతో చిత్తవుతున్న రైతులు…. ఎగుమతులు పుంజుకున్న తర్వాత అమ్మితే పెట్టుబడైన మిగులుతుందని ఆశగా ఎదురుచూస్తున్నారు.