వెలిగొండ వరదల్లో బొలెరో గల్లంతు.. రాత్రంతా చెట్టుపైనే ముగ్గురు యువకులు!

వెలిగొండ ప్రాజెక్టు నుంచి నీటి విడుదల కారణంగా మార్కాపురం జిల్లా కలనూతల గ్రామ సమీపంలో వరదల్లో చిక్కుకున్న బొలెరో వాహనం కొట్టుకుపోయింది. వాహనంలోని ముగ్గురు యువకులు రాత్రంతా చెట్టుపైనే ప్రాణభయంతో గడిపారు. అధికారులు, రెస్క్యూ సిబ్బంది సమన్వయంతో సహాయక చర్యలు చేపట్టి, వారిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. ప్రాజెక్టు నీటి నిర్వహణపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

వెలిగొండ వరదల్లో బొలెరో గల్లంతు.. రాత్రంతా చెట్టుపైనే ముగ్గురు యువకులు!
Markapuram Flood Rescue

Updated on: Sep 01, 2026 | 8:00 AM

మార్కాపురం: వెలిగొండ ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయడంతో మార్కాపురం జిల్లాలోని ముంపు గ్రామాల్లో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. పెద్దారవీడు మండలం కలనూతల ముంపు గ్రామంలోకి భారీగా నీరు చేరడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ క్రమంలో నీటి ప్రవాహాన్ని దాటేందుకు ప్రయత్నించిన బొలెరో వాహనం కొట్టుకుపోవడంతో అందులో ఉన్న యువకులు ప్రమాదంలో చిక్కుకున్నారు. సకాలంలో స్పందించిన రెస్క్యూ సిబ్బంది వారిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు.

కలనూతల గ్రామాన్ని నిర్వాసితులు ఖాళీ చేస్తున్న సమయంలో ఒక్కసారిగా పెద్ద ఎత్తున నీరు వచ్చి చేరింది. దీంతో గ్రామం చుట్టూ నీటి ప్రవాహం పెరిగింది. ఇదే సమయంలో రోడ్డు దాటేందుకు ప్రయత్నించిన బొలెరో వాహనం అదుపుతప్పి వరద నీటిలో కొట్టుకుపోయింది. వాహనంలోని నలుగురు యువకులు వెంటనే బయటకు వచ్చి సమీపంలోని చెట్టును పట్టుకున్నారు. అయితే నీటి ఉధృతి ఎక్కువగా ఉండటంతో అక్కడి నుంచి బయటకు రావడం సాధ్యం కాలేదు. దీంతో రాత్రంతా చెట్టుపైనే ఉండి తమను కాపాడాలంటూ సహాయం కోసం కేకలు వేశారు.

సమాచారం అందుకున్న మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి, జిల్లా కలెక్టర్ విజయ సునీత, డీఎస్పీ యు. నాగరాజు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. పోలీసులతో పాటు అగ్నిమాపక, రెస్క్యూ సిబ్బంది కూడా అక్కడికి చేరుకున్నారు. అయితే నీటి ప్రవాహం ఉధృతంగా ఉండటంతో వెంటనే సహాయక చర్యలు చేపట్టడం కష్టంగా మారింది. కొల్లం వాగు, ఫీడర్ గేట్లను మూసివేసి నీటి ప్రవాహాన్ని కొంతమేర తగ్గించిన అనంతరం రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. చివరకు చెట్టుపై చిక్కుకున్న ముగ్గురు యువకులను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. మరో వ్యక్తి పరిస్థితిపై అధికారులు వివరాలు సేకరిస్తున్నారు.

ఇదిలా ఉండగా, వెలిగొండ ప్రాజెక్టు నుంచి నల్లమల సాగర్ జలాశయానికి ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారికంగా నీటిని విడుదల చేసిన నేపథ్యంలో భారీగా నీరు చేరుతోంది. ముంపు గ్రామాలను ముందుగానే ఖాళీ చేయించడంలో అధికారులు విఫలమయ్యారనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. తాజా ఘటనతో ముంపు ప్రాంతాల్లో భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేయాల్సిన అవసరం ఉందని స్థానికులు కోరుతున్నారు.

వీడియో ఇక్కడ చూడండి..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us