Bestavaripeta: ఫోన్ చేసి 50 వేలు చేబదులు అడిగిన ఎస్సై.. ఆ వ్యక్తి వెంటనే కొట్టేశాడు.. కట్ చేస్తే

Prakasam District: లోకల్ ఎస్సైగారి నుంచి ఫోన్ వచ్చింది. పాపకు స్కూల్ ఫీజు కట్టాలి.. 50 వేలు కట్టాలి.. సర్దితే.. సాయంత్రం రిటన్ చేస్తాను అన్నది కాల్ సారాశం. దీంతో కాల్ రిసీవ్ చేసుకున్న వ్యక్తి అయ్యో భలే వాళ్లు సార్ అని వెంటనే 50 వేలు ట్రాన్స్‌ఫర్ కొట్టేశాడు. కానీ తర్వాత...

Bestavaripeta: ఫోన్ చేసి 50 వేలు చేబదులు అడిగిన ఎస్సై.. ఆ వ్యక్తి వెంటనే కొట్టేశాడు.. కట్ చేస్తే
Bestavaripeta Police Station

Updated on: Jun 17, 2023 | 7:22 PM

ప్రకాశం జిల్లా బేస్తవారపేట ఎస్‌ఐ పేరుతో జనాన్ని బురిడీ కొట్టించి డబ్బులు కాజేస్తున్న ఘరానా మోసగాడిని పోలీసులు పట్టుకుని జైలుకు పంపించారు. బేస్తవారిపేట పట్టణంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సర్వీస్ పాయింట్ యజమానికి ఓ ఫోన్‌ కాల్‌ వచ్చింది. తాను బెస్తవారిపేట ఎస్ఐనని ఫోన్‌లో తెలిపాడు. తన కూతురి కాలేజీ ఫీజు అర్జెంటుగా కట్టాలని తన అకౌంట్‌లో డబ్బులు లేవన్నాడు… తన ఫోన్ పేకు 50 వేల రూపాయలు అర్జెంటుగా బదిలీ చేస్తే కొద్దిసేపట్లో వచ్చి తన వాళ్లు వచ్చి డబ్బు రిటన్ చేస్తారని నమ్మించాడు. వాట్సప్ ద్వారా క్యూఆర్ కోడ్ పంపించాడు… నిజంగా అవతలి వ్యక్తి ఎస్సై అని నమ్మిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సర్వీస్ పాయింట్ యజమాని 50 వేల రూపాయలు నగదు బదిలీ చేశాడు. తర్వాత ఎంతసేపటికి నగదు ఇచ్చేందుకు ఎవరు రాకపోవడంతో ఫోను వచ్చిన నంబర్‌కే తిరిగి ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ వచ్చింది. తాను మోసపోయానని గ్రహించి బేస్తవారిపేట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.

ఈ పరిణామంతో ఖంగుతిన్న బేస్తవారపేట ఎస్‌ఐ మాధవరావు తన పేరు చెప్పి ఘరానా మోసానికి పాల్పడ్డ నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. రెండు బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు పల్నాడు జిల్లాకు చెందిన రాజేంద్ర నాయక్‌గా గుర్తించారు. ఇతడికి గతంలోనే నేరచరిత్ర ఉందని ఇలానే ఎస్ఐనని మంచిగా మాట్లాడి మోసాలకు పాల్పడినట్లు గుర్తించామని సీఐ రాజేష్‌కుమార్‌ తెలిపారు. ఇంటర్నెట్ లో మీ సేవ, ఇతర సర్వీస్ పాయింట్ల నంబర్లను తెలుసుకుని వారితో పరిచయం ఉన్న వ్యక్తిలాగా మాట్లాడి వారి నుంచి నగదు కాజేస్తూ ఉంటాడని సిఐ వెల్లడించారు… ఇలా ఇతనిపై మరో నాలుగు కేసులు ఉన్నాయన్నారు… ప్రజలు ఎవరు కూడా అపరిచిత వ్యక్తులు ఫోన్ చేసి మాయమాటలు చెబితే నమ్మి మోసపోవద్దని సిఐ కోరారు.. అవతల వ్యక్తులు ఎవరు మాట్లాడుతున్నారో ఖచ్చితంగా తెలుసుకొని వ్యవహరించాలని సూచించారు.

ఫైరోజ్‌ బేగ్‌, ఒంగోలు, టీవీ9 తెలుగు

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం  క్లిక్ చేయండి..