
ఏపీ, తెలంగాణకు వాతావరణశాఖ భారీ వర్షసూచన జారీ చేసింది. నైరుతి రుతుపవనాల రాకతో తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే వర్షాలు పడుతున్నాయి. పలు జిల్లాల్లో తొలకరి జల్లులు కురుస్తున్నాయి. ఈ వర్షాలు ఇలాగే కొనసాగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. ఈ నెల 22వ తేదీ నుంచి 27వ తేదీ వరకు ఆరు రోజుల పాటు పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడతాయని తెలిపింది. నైరుతి రుతుపవనాలు విస్తరిస్తుండటం, స్థానిక వాతావరణ మార్పుల కారణంగా వానలు కురవనున్నాయని తెలిపింది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.ఉత్తర ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణ వరకు ద్రోణి విస్తరించగా.. రాయలసీమ పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో వర్షాలు పడతాయని పేర్కొంది.
మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, మహబూబాబాద్, నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, జోగులాంబ గద్వాల జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణశాఖ అంచనా వేసింది. కొన్ని జిల్లాల్లో మాత్రమే భిన్నమైన వాతావరణం ఉంటుందని, ఎండ తీవ్రత ఉంటుందని తెలిపింది. ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో పలుచోట్ల తీవ్రమైన వడగాలులు వీస్తాయని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. 102 మండలాల్లో తీవ్రమైన వడగాల్పులు ఉండనుండగా.. 33 మండలాల్లో తీవ్రంగా ఉంటుందని స్పష్టం చేసింది. అటు ఆదివారం పలు జిల్లాల్లో వర్షాలు కురిశాయి. అత్యధికంగా నార్కెట్ పల్లిలో 7.4 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక జనగామ జిల్లా జఫర్ గఢ్లో 6.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
ఇక ద్రోణి, ఉపరిత ఆవర్తనం ప్రభావంతో ఏపీలో కూడా భారీ వర్షాలు పడనున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలకు ఛాన్స్ ఉంది. ఇక ఈ జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరికలు కూడా వాతావరణశాఖ జారీ చేసింది. దీంతో వర్షం పడే సమయంలో చెట్ల కింద ఉండవద్దని అధికారులు సూచిస్తున్నారు. అలాగే విద్యుత్ స్తంభాలు, భారీ హోర్డింగ్స్ దగ్గర ఉండవదవ్దని హెచ్చరిస్తున్నారు. అటు తెలుగు రాష్ట్రాలను నైరుతి రుతుపవనాలు తాకగా.. ప్రస్తుతం నెమ్మదిగా విస్తరిస్తున్నాయి. దీని రాకతో వర్షాలు మొదలయ్యాయి. దీంతో వానాకాలం సీజన్ మొదలైనట్లయింది. ఎండలు క్రమక్రమంగా తగ్గుముఖం పడుతూ ప్రజలకు ఊరట కల్పిస్తున్నాయి.