Andhra: ఎంతకు తెగించార్రా.. జిల్లా కలెక్టర్ సంతకం ఫోర్జరీ చేసి.. ఏం చేశారో తెలుసా..?

చిత్తూరులో భారీ భూ మోసం వెలుగుచూసింది. 22ఏ నిషేధిత భూముల జాబితా నుంచి భూమిని తొలగించినట్లు చూపించేందుకు కేటుగాళ్లు ఏకంగా జిల్లా కలెక్టర్ సంతకాన్నే ఫోర్జరీ చేశారు. నకిలీ ప్రొసీడింగ్ ఆర్డర్‌తో రిజిస్ట్రేషన్‌కు ప్రయత్నించగా సబ్ రిజిస్ట్రార్‌కు అనుమానం రావడంతో అసలు బండారం బయటపడింది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ముఠాను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Andhra: ఎంతకు తెగించార్రా.. జిల్లా కలెక్టర్ సంతకం ఫోర్జరీ చేసి.. ఏం చేశారో తెలుసా..?
Fraudsters Forge Chittoor Collectors Signature

Edited By:

Updated on: May 19, 2026 | 3:51 PM

చిత్తూరులో కేటుగాళ్లు బరితెగించారు. ఏకంగా చిత్తూరు కలెక్టర్ సంతకం ఫోర్జరీ చేసారు. గంగవరంలో ఒక ప్రైవేటు భూమిని అమ్మడం కోసం కలెక్టర్ సంతకాన్ని ఫోర్జరీ చేయడం సంచలనంగా మారింది. కలెక్టర్ ప్రకటించినట్లుగా.. ఫేక్ గా కలెక్టర్ సంతకాన్ని ఫోర్జరీ చేసి.. 22ఏ నిషేధిత భూముల జాబితా నుండి భూమి వివరాలు తొలగించినట్టు చూపే ప్రయత్నం చేసారు. ఈ మేరకు కలెక్టర్ ఫేక్ సంతకంతో ప్రొసీడింగ్ ఆర్డర్ తయారు చేశారు. మంజునాథరెడ్డి పేరుపై జాతీయ రహదారి ప్రక్కన సర్వే నెంబర్ 244/1 పై 1.11 సెంట్ల భూమిని నిషేధిత భూముల జాబితాలో ఉందని తెలుసుకుని ట్రాప్ చేసారు. 22ఏ లో ఉన్న భూమిని అమ్ముకోలేక ఇబ్బంది పడుతున్న మంజునాథరెడ్డిని దళారీలు నమ్మించారు.

నిషేధిత జాబితా నుండి తొలగించి భూమిని అమిస్తామని రూ.5 లక్షలకు ఒప్పందం చేసుకున్నారు. ఈ మేరకు కొందరు రెవెన్యూ అధికారులను కలిసారు. పాత ప్రొసీడింగ్ కాపీని తీసుకుని ఫోర్జరీ చేసిన ముఠా.. పాత కాపీలోని డేట్లు, సర్వే నెంబర్లు మార్చి నకిలీ ఆర్డర్ కాపీ రెడీ తయారు చేసారు. నకిలీ సంతకం చేసిన ప్రొసీడింగ్ తో నిషేధిత జాబితాలోని భూమిని రిజిస్ట్రేషన్ చేయాలని పలమనేరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లారు. భూమి యజమాని సమర్పించిన ప్రొసీడింగ్ కాపీలో తేదీ లేకుండా 2024 ఏడాది మాత్రమే ఉండడంతో సబ్ రిజిస్ట్రార్ కు అనుమానం వచ్చింది.

ప్రొసీడింగ్ కాపీని జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయానికి పంపి పలమనేరు సబ్ రిజిస్ట్రార్ ఆరా తీశారు. జిల్లా కలెక్టర్ కార్యాలయానికి కాపీని పంపి పరిశీలించాలని జిల్లా రిజిస్ట్రార్ కోరడంతో అసలు బండారం బయటపడింది. నకిలీ ప్రొసీడింగ్ కాపీగా గుర్తించిన కలెక్టరేట్ అధికారులు.. కలెక్టర్ కు సమాచారం అందించారు. కలెక్టర్ ఆదేశాలతో నకిలీ ప్రొసీడింగ్ కాపీపై గంగవరం పోలీసులకు ఫిర్యాదు చేసారు రెవెన్యూ అధికారులు.. ఈ మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కలెక్టర్ సంతకాన్ని ఫోర్జరీ చేసిన ముఠాను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. కాగా, ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది.

వీడియో చూడండి..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us