Andhra: స్కూల్‌కి అని వెళ్లారు.. గంటలు గడిచినా తిరిగి రాలేదు.. సీసీ కెమెరా చూసి కళ్లు తేలేశారు

చిత్తూరు జిల్లాలో ఇన్‌స్టాగ్రామ్ స్నేహం వలలో పడి ఇల్లు వదిలి వెళ్ళిన ఇద్దరు మైనర్ బాలికలను పోలీసులు కేవలం 48 గంటల్లో క్షేమంగా కనుగొన్నారు. సాంకేతిక ఆధారాల సాయంతో వారిని రక్షించిన పోలీసులు, తల్లిదండ్రులకు అప్పగించి కౌన్సెలింగ్ ఇచ్చారు. ఆ వివరాలు ఇలా..

Andhra: స్కూల్‌కి అని వెళ్లారు.. గంటలు గడిచినా తిరిగి రాలేదు.. సీసీ కెమెరా చూసి కళ్లు తేలేశారు
Representative Image

Updated on: Apr 17, 2026 | 10:02 AM

సోషల్ మీడియా మాయలో పడి మైనర్ బాలికలు దారి తప్పుతున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా చిత్తూరు జిల్లాలో ఇన్‌స్టాగ్రామ్ పరిచయంతో ఇద్దరు బాలికలు తల్లిదండ్రులకు చెప్పకుండా ఇల్లు వదిలి వెళ్ళడం కలకలం రేపింది. అయితే, చిత్తూరు పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి కేవలం 48 గంటల్లోనే వారిని క్షేమంగా పట్టుకున్నారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.. చిత్తూరు జిల్లాకు చెందిన ఇద్దరు మైనర్ బాలికలు గత రెండు రోజుల క్రితం తమ ఇళ్ల నుంచి ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయారు. పిల్లలు కనిపించకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు స్థానిక పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించగా, సాంకేతిక ఆధారాల ద్వారా వారు ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన వ్యక్తులను కలిసేందుకు వెళ్ళినట్లు ప్రాథమికంగా గుర్తించారు.

జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించిన పోలీసులు, బాలికల మొబైల్ సిగ్నల్స్, సోషల్ మీడియా ఖాతాలను నిశితంగా పరిశీలించారు. వారు ఎక్కడికి వెళ్లారు? ఎవరిని కలిశారు? అనే కోణంలో దర్యాప్తు జరిపి, కేవలం 48 గంటల వ్యవధిలోనే వారి ఆచూకీని కనుగొన్నారు. వారిని సురక్షితంగా అదుపులోకి తీసుకున్న పోలీసులు తిరిగి చిత్తూరుకు తీసుకువచ్చారు. పోలీసుల విచారణలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇన్‌స్టాగ్రామ్‌లో గుర్తు తెలియని వ్యక్తులతో ఏర్పడిన స్నేహం కారణంగానే వారు ఇల్లు వదిలి వెళ్ళినట్లు తెలిసింది. ప్రస్తుత కాలంలో సోషల్ మీడియాలో పరిచయమయ్యే వ్యక్తులు మైనర్లను ఎలా ప్రలోభపెడుతున్నారో ఈ ఘటన మరోసారి నిరూపించింది. సరైన అవగాహన లేక బాలికలు ఇలాంటి నిర్ణయాలు తీసుకుని ప్రమాదాల బారిన పడుతున్నారని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

బాలికలను సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించిన అనంతరం పోలీసులు వారికి కౌన్సెలింగ్ నిర్వహించారు. పిల్లల చేతికి స్మార్ట్‌ఫోన్లు ఇచ్చేటప్పుడు తల్లిదండ్రులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, వారు సోషల్ మీడియాలో ఎవరితో మాట్లాడుతున్నారో గమనిస్తూ ఉండాలని సూచించారు. అజ్ఞాత వ్యక్తులతో స్నేహం చేయడం వల్ల జరిగే అనర్థాల గురించి పిల్లలకు వివరించాలని కోరారు. సకాలంలో స్పందించి తమ పిల్లలను కాపాడిన పోలీసులకు తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.

ఇది చదవండి: హైదరాబాద్ టూ నరసాపురం.. పాస్టర్ ఇంటికి రెండు పే..ద్ద లగేజీలు.. ఓపెన్ చేయగా

Follow Us