
వెండితెరపై హీరోగా మెరవాలనుకున్నాడు.. వేలాది మంది అభిమానుల చప్పట్ల మధ్య స్టార్గా నిలవాలని కలలు కన్నాడు. ఆ కలను నిజం చేసుకోవడానికి తన తల్లినే నిర్మాతగా పెట్టి, తానే హీరోగా, దర్శకుడిగా ఒక సినిమాను కూడా ప్రారంభించాడు. కానీ… విధి మరో కథ రాసింది. సినిమా సెట్లో ఉండాల్సిన ఆ యువకుడు.. చివరకు జైలు ఊచలు లెక్కపెట్టాల్సి వచ్చింది. వెండితెరపై విలన్లను ఓడించాలని కలలు కన్న వ్యక్తి… రియల్ లైఫ్లోనే మోస్ట్ వాంటెడ్ క్రిమినల్గా మారిపోయాడు. సినిమా హీరో కావాలనే ఆశతో మొదలైన ప్రయాణం… చివరకు క్రైమ్ ప్రపంచంలోకి దారి తీసింది. ఇళ్లలో దొంగతనం చేయడం తన స్థాయికి తక్కువ అనుకున్నాడో ఏమో… ఏకంగా భారీ షాపింగ్ మాల్స్నే టార్గెట్ చేశాడు. మూడు రాష్ట్రాల పోలీసులను పదేళ్ల పాటు ముప్పుతిప్పలు పెట్టిన ఆ సినీ హీరో ఎవరు?
పైన ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు నాగరాజు గారి ఆనంద్. బెంగళూరుకు చెందిన ఆనంద్కు చిన్నప్పటి నుంచే సినిమాలంటే ప్రాణం. తన తల్లిని నిర్మాతగా పెట్టి, తానే హీరోగా, దర్శకుడిగా ఒక సినిమాను ప్రారంభించాడు. సినిమా షూటింగ్ సగం పూర్తయ్యే వరకు అంతా బాగానే సాగింది. అయితే ఒక మహిళ హత్య కేసులో అతనిపై ఆరోపణలు రావడంతో ఆనంద్ జీవితం ఒక్కసారిగా మారిపోయింది. ఆ కేసులో జైలుకు వెళ్లడంతో సినిమా మధ్యలోనే ఆగిపోయింది. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆనంద్ పూర్తిగా మారిపోయాడు. పగలు పూల వ్యాపారి… రాత్రిళ్లు హైటెక్ దొంగ. సాధారణ ఇళ్లను కాదు… భారీ షాపింగ్ మాల్స్నే లక్ష్యంగా చేసుకున్నాడు. ఆనంద్ పని చేసే విధానం కూడా విభిన్నం. ఎలాంటి గ్యాంగ్ లేకుండా ఒంటరిగానే రెక్కీ నిర్వహించడం… స్కెచ్ వేయడం… దొంగతనం చేసి ఎలాంటి ఆనవాళ్లు లేకుండా మాయమవడం అతని ప్రత్యేకత.
బాలీవుడ్ సూపర్ హిట్ సినిమా’ధూమ్’ను ఆదర్శంగా తీసుకున్న ఆనంద్… భవనాల పైకప్పుల నుంచి భారీ తాళ్ల సాయంతో కిందకు దిగుతూ దొంగతనాలు చేసేవాడు. ముఖానికి మాస్క్, చేతులకు గ్లౌజులు, పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు వాహనాల నంబర్ ప్లేట్లు మార్చడం… ఇలా ప్రతి అడుగులోనూ సినిమాను తలపించే ప్లానింగ్తో ముందుకెళ్లేవాడు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు… ఇలా మూడు రాష్ట్రాల పోలీసులకు దాదాపు పదేళ్ల పాటు ముచ్చెమటలు పట్టించాడు. అతనిపై నమోదైన కేసుల సంఖ్య ఏకంగా 32. కానీ ఎంత తెలివైన నేరస్థుడైనా ఒకరోజు చట్టానికి చిక్కాల్సిందే. జూన్ 28 అర్ధరాత్రి అనంతపురంలోని డ్రెస్ సర్కిల్, కాంచీపురం షాపింగ్ మాల్స్లో జరిగిన చోరీల తర్వాత పోలీసులు ప్రత్యేక దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించిన అధికారులు… భవనం పై నుంచి భారీ తాడుతో కిందకు దిగుతున్న దృశ్యాలు చూసి ఆశ్చర్యపోయారు. ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపిన అనంతపురం పోలీసులు… చివరకు ఈ హైటెక్ సినీ దొంగ ఆటకు ముగింపు పలికారు.
విచారణలో ఆనంద్ చెప్పిన మాటలు పోలీసులనే ఆశ్చర్యపరిచాయి. “ఇళ్లలో దొంగతనం చేస్తే పేదవాళ్లు నష్టపోతారు. అందుకే షాపింగ్ మాల్స్ను మాత్రమే టార్గెట్ చేసేవాడిని. వాళ్లకు ఇన్సూరెన్స్ ఉంటుంది… నష్టం భర్తీ అవుతుంది” అని చెప్పినట్లు పోలీసులు వెల్లడించారు. అది కన్విన్స్ అయ్యే లాజిక్ అయినా… చట్టం ముందు నేరం నేరమే. వెండితెరపై హీరో కావాలనుకున్న ఆనంద్… చివరకు క్రైమ్ స్టోరీల్లో విలన్గా మాత్రమే మిగిలిపోయాడు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..