
వాయువ్య బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న పశ్చిమ బెంగాల్-ఉత్తర ఒడిశా తీర ప్రాంతాల్లో కొనసాగుతున్న అల్పపీడనం రాబోయే 48 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రాగల మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని అధికారులు తెలిపారు. వర్షాలతో పాటు తీర ప్రాంతాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అయితే అల్పపీడనానికి అనుబంధంగా సగటు సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది. ఇది రాబోయే 48 గంటల్లో మరింత బలపడి, ఉత్తర ఒడిశా – గంగానది పరివాహక పశ్చిమ బెంగాల్ మీదుగా పశ్చిమ-వాయువ్య దిశగా పయనించే అవకాశముంది. సగటు సముద్ర మట్టం వద్ద ఉన్న రుతుపవన ద్రోణి అమృత్సర్, నజీబాబాద్, హర్దోయ్, సుల్తాన్పూర్, డాల్టన్గంజ్, పూర్నియా మీదుగా ఈ అల్పపీడన కేంద్రం గుండా తూర్పు మధ్య బంగాళాఖాతం వైపు కొనసాగుతుంది.
శనివారం ఒకటి లేదా రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశముంది. అక్కడక్కడా ఉరుములు, మెరుపులు సంభవించవచ్చు. గంటకు 40 నుంచి 50 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయి. ఆది, సోమవారాల్లో ఒకటి లేదా రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి. గంటకు 40-50 కి.మీ వేగంతో బలమైన గాలులు వీచే వీలుంది.
రాగల మూడు రోజుల పాటు ఒకటి లేదా రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయి.
రాబోయే మూడు రోజుల్లో రాయలసీమ వ్యాప్తంగా ఒకటి లేదా రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే సూచనలు ఉన్నాయి. గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. కాగా ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు వీచే సమయంలో రైతులు, వ్యవసాయ కూలీలు, గొర్రెల కాపరులు చెట్ల కింద, విద్యుత్ స్తంభాల వద్ద ఉండకూడదని విపత్తు నిర్వహణ శాఖ అధికారులు హెచ్చరించారు.