
పరిపాలనా అంశాల్లో కూటమి సర్కార్ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ప్రధానంగా.. అన్ని ప్రభుత్వ శాఖలను ప్రక్షాళన చేసేందుకు సిద్ధమైంది. దానిలో భాగంగా.. ఉద్యోగుల బదిలీలకు ఏపీ ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. మొత్తం 15శాఖల్లో బదిలీలకు
అనుమతిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి ఉత్తర్వులు జారీ చేసింది. ఉద్యోగుల బదిలీల్లో అనుసరించాల్సి మార్గదర్శకాలను వెల్లడించింది. ఈ నెల 19 నుంచి 31వరకు ఉద్యోగుల బదిలీల ప్రక్రియ చేపట్టాలని తెలిపింది.
ఇక.. రెవిన్యూ, పంచాయితీరాజ్, మున్సిపల్, గ్రామ వార్డు సచివాలయాలు, గనులు, పౌర సరఫరాలు, అన్ని ప్రభుత్వ శాఖల్లోని ఇంజినీరింగ్ విభాగాల ఉద్యోగుల బదిలీలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అలాగే.. దేవదాయ, అటవీ, రవాణా, పరిశ్రమలు, విద్యుత్, వాణిజ్య పన్నులు, స్టాంపులు-రిజిస్ట్రేషన్లు, ఎక్సైజ్ శాఖల్లోనూ బదిలీలకు ఆమోదం తెలిపింది. అయితే.. ఎక్సైజ్ శాఖలో సెప్టెంబర్ 5 నుంచి 15 వరకు బదిలీలకు ప్రత్యేక ఉత్తర్వులు ఇచ్చింది. టీచర్లు, వైద్యారోగ్య సిబ్బంది బదిలీలకు మాత్రం అనుమతి లేదని స్పష్టం చేసింది ఏపీ ప్రభుత్వం. ప్రస్తుతం ప్రజా సంబంధిత సేవలు అందించే శాఖల్లో మాత్రమే బదిలీలకు అనుమతించినట్లు వెల్లడించింది.
ఈ నెలాఖారులోగా ఉద్యోగుల ట్రాన్స్ఫర్స్ పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇక.. ఉద్యోగుల బదిలీలు ఉమ్మడి 13 జిల్లాల ప్రాతిపదికన జరగనున్నట్లు తెలిపింది. గిరిజన ప్రాంతాల్లో రెండేళ్లు పనిచేసిన ఉద్యోగులు, ఉద్యోగి కానీ.. వారి కుటుంబ సభ్యులకు కానీ ఏదైనా అనారోగ్య సమస్యలు ఉంటే బదిలీలకు దరఖాస్తు చేసుకోవచ్చని మార్గదర్శకాలు జారీ చేసింది. అలాగే.. భార్యభర్తలు ఉద్యోగులైతే.. ఒకే ఊరు లేదా సమీప ప్రాంతాల్లో బదిలీలకు అవకాశం ఇచ్చింది. అంధులైన ఉద్యోగులకు బదిలీల నుంచి మినహాయింపు ఇచ్చింది. ఉద్యోగ సంఘాల ఆఫీష్ బేరర్లకు తొమ్మిదేళ్ల బదిలీ నుంచి మినహాయింపు ఇచ్చింది. అయితే.. ఆయా లేఖలను పరిశీలించిన తర్వాత పరిపాలనపరంగా అవసరమైతే తొమ్మిదేళ్లకు ముందే ఆఫీస్ బేరర్లను బదిలీలు చేయొచ్చని ఉత్తర్వుల్లో పేర్కొంది.