Andhra Pradesh: ఏపీలో సొంతిల్లు లేనివారికి ప్రభుత్వం తీపికబురు.. కొత్త ఇళ్ల మంజూరుకు డేట్ ఫిక్స్

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలోని పేదలకు ఇళ్లను కేటాయించేందుకు ముహూర్తం ఫిక్స్ అయింది. ఏప్రిల్‌లో ఇళ్లను మంజూరు చేయనుందని తెలుస్తోంది. పీఎం ఆవాస్ యోజన పథకం ద్వారా రాష్ట్రంలోని ప్రజలకు ఇళ్లను మంజూరు చేయనుంది. ప్రస్తుతం దరఖాస్తుల పరిశీలన జరుగుతోంది.

Andhra Pradesh: ఏపీలో సొంతిల్లు లేనివారికి ప్రభుత్వం తీపికబురు.. కొత్త ఇళ్ల మంజూరుకు డేట్ ఫిక్స్
Pm Awas Yojana

Updated on: Feb 23, 2026 | 9:33 PM

ఏపీలో సొంతిల్లు లేనివారికి రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు అందించింది. త్వరలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ 2.0 పథకం ద్వారా పేదలకు ఇళ్లు కేటాయించనుంది. ఈ మేరకు ముహూర్తం ఖారారు అయింది. ఏప్రిల్‌లో ఈ పథకం కింద లబ్దిదారులకు ఇళ్లను మంజూరు చేయనుంది. గత ఏడాది డిసెంబర్ వరకు పీఎం ఆవాస్ యోజన పథకం ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని ఏపీ ప్రభుత్వం కల్పించింది. దీంతో లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. దాదాపు ఈ పథకం కింద లబ్ది పొందేందుకు 10.42 లక్షల మంది దరఖాస్తు పెట్టుకున్నారు. వీటి దరఖాస్తులను ప్రస్తుతం అధికారులను పరిశీలిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పర్యటించి లబ్దిదారులను గుర్తిస్తున్నారు. ఏప్రిల్‌లో లబ్దిదారుల జాబితాను విడుదల చేయనున్నారు.

ఆమోదం కోసం కేంద్రానికి..

పీఎం ఆవాస్ యోజన పథకం ద్వారా మొత్తం 10.42 లక్షల దరఖాస్తులు రాగా.. వీటిల్లో స్థలం ఉంది ఇంటి కోసం ఆర్దిక సాయం పొందేందుకు 8.29 లక్షల మంది అప్లికేషన్ పెట్టుకున్నారు. ఇక స్థలంతో పాటు ఇంటి కోసం 2.13 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ దరఖాస్తుల్లో 1.43 లక్షల మంది ఎస్టీలు, 2.16 లక్షల మంది ఎస్సీలు, దివ్యాంగులు 4,965 మంది ఉండగా.. ఇతరులు 6.92 లక్షల మంది ఉన్నారు. ఏపీ ప్రభుత్వం దరఖాస్తుల పరిశీలన చేపట్టి ఆమోదం కోసం కేంద్రానికి పంపించింది. కేంద్రం నుంచి ఆమోదం వచ్చిన తర్వాత లబ్దిదారులకు మంజూరు పత్రాలు అందించనున్నారు. మార్చి 3 వరకు కేంద్రం దరఖాస్తులను పరిశీలించనుంది. మొత్తం దరఖాస్తుల్లో 60 వేలను కేంద్ర ప్రభుత్వం తిరస్కరించింది. వీరిని ఇప్పటికే అనర్హులుగా తేల్చింది.

స్థలం లేనివారికి కూడా లబ్ది

ఇక స్థలం లేనివారికి కూడా 3 సెంట్ల స్థలం కేటాయించనున్నారు. వీటిల్లో ఇంటిని నిర్మించుకునేందుకు ఆర్ధిక సాయం అందిస్తారు. ఇక స్థలం ఉండి ఇళ్లు లేనివారికి ఆర్ధిక సాయం విడతల వారీగా అందించనున్నారు. ముందుగా అత్యంత పేదలకు ఇళ్లను కేటాయించనున్నారు. వితంతువులు, ఎస్టీ, ఎస్సీ, బీసీలకు తొలి ప్రాధాన్యత కల్పిస్తారు. ఆ తర్వాత మిగతావారికి ప్రాధాన్యత ఉంటుంది. ఇక ఈ పథకం కింద లబ్ది పొందేందుకు  అల్లూరి సీతారామరాజు జిల్లా నుంచి అత్యధికంగా  77,353 దరఖాస్తులు వచ్చాయి. ఇక శ్రీకాకుళం జిల్లా నుంచి 75,117  రాగా.. అన్నమయ్య జిల్లా  నుంచి 68,508 అప్లికేషన్స్ వచ్చాయి. ఇక అత్యల్పంగా విశాఖపట్నం జిల్లా నుంచి 7433 మాత్రమే దరఖాస్తులు వచ్చినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.

Follow Us