
ఆంధ్రప్రదేశ్లో బడి గంటకు వేళైంది. జూన్ 12వ తేదీ నుంచి స్కూల్స్ ప్రారంభం అవుతున్నాయి. సమ్మర్ హాలిడేస్ అనంతరం స్కూల్స్ తిరిగి శుక్రవారం నుంచి ప్రారంభం అవుతున్నాయి. దీంతో 2026-2027 కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కానుండగా.. విద్యా క్యాలెండర్ను ప్రభుత్వం విడుదల చేసింది. మొత్తం 229 పని దినాలు ఉండగా.. 87 రోజులు సెలవులు ఉన్నాయి. అయితే విద్యా సంవత్సరం శుక్రవారం నుంచి ప్రారంభం కానుండటంతో తల్లికి వందనం నిధుల కోసం విద్యార్థులు, తల్లిదండ్రులు ఎదురుచూస్తున్నారు. ఇవి ఎప్పుడు అకౌంట్లో పడతాయా అని నిరీక్షిస్తున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చింది. వచ్చే నెలలో నిధులను జమ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు లబ్దిదారుల జాబితా సిద్దం చేయాలని ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.
అయితే తల్లికి వందనం నిధులు అందుకోవాలంటే తప్పనిసరిగా మూడు పనులు చేయాలని ప్రభుత్వం తెలిపింది. ఒకటి తల్లి బ్యాంక్ ఖాతాకు ఆధార్ లింక్ అయి ఉండాలి. ఇక ఎన్పీసీఐ (Aadhaar Seeding) పూర్తయి ఉండాలి. ఇక మూడో విషయం బ్యాంక్ కేవైసీ వివరాలు అప్డేట్ చేసుకుని ఉండాలి. ఈ మూడింటిలో ఏ ఒక్కటి పెండింగ్లో ఉన్నా నిధులు పొందటంలో అవాంతరాలు ఎదురయ్యే అవకాశముంటుంది. దీంతో అన్నీ వివరాలు సరిగ్గా ఉండేలా అప్డేట్ చేసుకోవాలని ప్రభుత్వం సూచిస్తోంది. చాలామంది విద్యార్థుల వివరాలు ఎన్పీసీఐ లాగిన్లో తెరుచుకోవడం లేదు. దీంతో గ్రామ, వార్డు సచివాలయాలకు వెళ్లి విద్యార్థుల తల్లిదండ్రలు బ్యాంక్ ఖాతా వివరాలను విద్యార్థుల పేర్లతో నమోదు చేయించాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. విద్యార్థుల తల్లిదండ్రులకు ఈ సమాచారం అందించాలని సూచించింది. బ్యాంక్ అకౌంట్ ద్వారా ఎన్పీసీఐ యాక్టివేషన్ కాకుంటే ఇండియా పోస్టల్ పేమెంట్స్ బ్యాంక్ అకౌంట్ తెరిపించాలని, దానికి ఎన్పీసీఐ లింకింగ్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది.
త్వరలోనే తల్లికి వందనం అర్హుల జాబితాను గ్రామ/వార్డు సచివాలయాల్లో ప్రదర్శించనున్నారు. దీంతో పాటు పాఠశాలలు ప్రారంభమైన రోజే విద్యార్థులకు యూనిఫామ్లు, పుస్తకాలు, బ్యాగులు, షూలు కూటమి సర్కార్ అందించనుంది. తల్లికి వందనం పథకం ద్వారా ప్రతీ ఏడాది ప్రభుత్వం రూ.15 వేల ఆర్ధిక సాయం అందిస్తోంది. వీటిల్లో రూ.13 వేలను విద్యార్థుల తల్లిదండ్రుల బ్యాంక్ అకౌంట్లలో వేస్తుండగా.. రూ.2 వేలను స్కూళ్ల నిర్వహణ కోసం ప్రభుత్వం తీసుకుంటుంది. విద్యా సంవత్సరం ప్రారంభమైన వెంటనే వీటిని అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గతంలో ఎంతమంది పిల్లలున్నా ఒక్కరికి మాత్రమే ఈ సాయం అందించేవారు. అయితే ఇప్పుడు ప్రతీఒక్కరికీ అందిస్తున్నారు.