
ఆక్వా రైతులకు మంచి ధరలు అందాలని, ఈ లక్ష్యాలను చేరుకోవడానికి రాష్ట్రంలో వినియోగం పెంచే దిశగా ఆక్వా హబ్లను ఏర్పాటు చేస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. చేపల వినియోగం పెరగాలని, సరసమైన ధరలకు ప్రజలకు చేరాలని ఆయన అధికారులకు సూచించారు. పశుసంవర్ధకశాఖ, డెయిరీ, ఫిషింగ్ హార్బర్లు, ఫిష్ ల్యాండ్ సెంటర్ల పనులు ప్రగతిపైనా సమీక్షించారు జగన్.

ఆక్వా వర్విటీ ఏర్పాటుపై ఫోకస్ పెంచాలని ఆదేశించారు సీఎం జగన్. వర్శిటీ పనులను వేగవంతం చేయాలన్నారు. రాష్ట్రంలో చేపలు, రొయ్యల ఉత్పత్తుల వినియోగం పెరిగేలా చూడాలని సూచించారు. లక్ష్యాలను చేరుకునేందుకు ఆక్వా హబ్లను ఏర్పాటు చేస్తున్నట్లు, స్థానిక మార్కెట్ను విస్తరించడం వల్ల రైతులకు మేలు జరుగుతుందని చెప్పారు. ఇంటిగ్రేటెడ్ ఆక్వా ల్యాబ్స్పై విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు.

ఏపీలోని 7 ఫిషింగ్ హార్బర్లు, 5 ఫిష్ ల్యాండ్ సెంటర్లలో పనుల ప్రగతిని తెలుసుకున్నారు సీఎం జగన్. 5 చోట్ల పనులు మొదలైనట్టు అధికారులు వివరించారు. మరోవైపు.. ఆక్వా సీడ్, ఫీడ్ల విషయంలో ఎలాంటి కల్తీలు ఉండకూడదని ఆదేశించారు. ఈమేరకు కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఆక్వా రైతుల ఆదాయం పెరిగేందుకు కేజ్, మరీ కల్చర్పై దృష్టి పెట్టాలన్నారు.

ఆక్వా లాబ్స్ను వినియోగించుకోవడంపై ప్రచారం, అవగాహన కల్పించాలని సీఎం జగన్ అధికారులకు సూచించారు. ఆక్వా రంగానికి సంబంధించి క్వాలిటీ చెకింగ్స్ ఎలా చేయించుకోవాలన్నదానిపై అవగాహన పెంచాలన్నారు. ఈ ల్యాబ్లను ఆర్బీకేలకు అనుసంధానం చేయాలని, ఆక్వా సీడ్, ఫీడ్ల విషయంలో ఎలాంటి కల్తీలు ఉండకూడదని తెలిపారు.

వెటర్నరీ డిస్పెన్సరీల్లో హేతుబద్ధత ఉండాలని, ప్రతి గ్రామం, మండలంలో ఏం ఉండాలనేదాన్ని నిర్ధారించాలని అధికారులకు సీఎం సూచించారు.హేతుబద్ధత ప్రకారం డిస్పెన్సరీలను పెట్టాలని, తర్వాత వాటిని మెరుగ్గా నిర్వహించాలని సీఎం వైఎస్ జగన్ తెలిపారు. డిస్పెన్సరీలు ఆర్బీకేలతో అనుసంధానం చేయాలన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా పశువుల ఆస్పత్రుల్లో నాడు నేడుపై కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. నాడు నేడులో భాగంగా నిర్మాణాలు, మౌలిక సదుపాయాల కల్పన తదితర అంశాలను ముందు నిర్దారించుకోలన్నారు. తర్వాత పనులు ప్రారంభానికి చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు.