
ఏలూరు జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. పిల్లలకు మంచి మాటలు చెప్పాల్సిన ఓ పాస్టర్ కామాందుడిగా మారి బాలికపై అత్యాచారినికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళ్తే.. కళ్లచెరువు గ్రామానికి చెందిన చౌటపల్లి రాంబాబు అనే చర్చి పాస్టర్, బాధిత బాలిక కుటుంబంతో ఉన్న పరిచయాన్ని ఆసరాగా చేసుకొని ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. తరచూ ఆ ఇంటికి వెళ్తూ అందరి నమ్మకాన్ని సంపాదించిన రాంబాబు, ఆ నమ్మకాన్నే పెట్టుబడిగా మార్చుకున్నాడు. గత కొన్ని నెలలుగా సదరు మైనర్ బాలికపై బెదిరింపులకు పాల్పడుతూ వరుసగా లైంగిక దాడులకు పాల్పడినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
అయితే కొద్దిరోజులుగా బాలిక అనారోగ్యంతో బాధపడుతుండటంతో కుటుంబ సభ్యులు ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ బాలికకు పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఆమె గర్భవతి అని నిర్ధారించారు. అది విన్న కుటుంబ సభ్యులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఈ విషయం బయటకు తెలిస్తే తన పరువు పోతుందని భావించిన నిందితుడు రాంబాబు, బాలికకు అధిక మోతాదులో గర్భస్రావం మాత్రలు ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే మాత్రల ప్రభావంతో బాలికకు విపరీతమైన రక్తస్రావం జరగడంతో పరిస్థితి విషమించింది. ప్రస్తుతం ఆమె ప్రభుత్వాసుపత్రిలో అత్యవసర చికిత్స పొందుతోంది
ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించడంతో ఘటనపై రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ తీవ్రంగా స్పందించింది. పత్రికా కథనాలు, ప్రాథమిక సమాచారం మేరకు కేసును సుమోటోగా స్వీకరించింది. ఈ నేపథ్యంలోనే కమిషన్ చైర్మన్ వేటుకూరి సూర్యనారాయణ రాజు, జిల్లా ఇంచార్జి సభ్యులు ఉండవల్లి గాంధీ బాబు సోమవారం కళ్లచెరువు గ్రామాన్ని సందర్శించనున్నారు. బాధిత బాలిక ఆరోగ్య పరిస్థితి, పోలీసుల దర్యాప్తు పురోగతి, అధికారుల స్పందనపై సమగ్ర వివరాలు సేకరించనున్నారు. బాలికకు అవసరమైన వైద్య, న్యాయ సహాయం అందించాలని సంబంధిత అధికారులకు కమిషన్ ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడి పాత్ర, ఘటన జరిగిన పరిస్థితులపై ఆధారాలు సేకరిస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.