చంద్రబాబు కేసుల్లో కొనసాగుతున్న కోర్టు విచారణలు.. కస్టడీ, బెయిల్ పిటిషన్లపై ఇవాళ ఏం జరగనుంది..?

|

Oct 04, 2023 | 7:27 AM

Vijayawada: రెండు రోజుల కస్టడీలో చంద్రబాబు విచారణకు సహకరించలేదని సిఐడి చెబుతోంది. పోలీస్ కస్టడీ పొడిగింపుతో పాటు బెయిల్ పిటిషన్ పైనా నేడు ఒకేసారి వాదనలు కొనసాగనున్నాయి. మరోవైపు చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ సోమవారానికి వాయిదా పడింది. అటు.. ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కేసులో.. చంద్రబాబునాయుడు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు..

చంద్రబాబు కేసుల్లో కొనసాగుతున్న కోర్టు విచారణలు.. కస్టడీ, బెయిల్ పిటిషన్లపై ఇవాళ ఏం జరగనుంది..?
Chandrababu And Lokesh
Follow us on

విజయవాడ, అక్టోబర్ 04: టీడీపీ అధినేత చంద్రబాబు కేసుల వ్యవహారంలో.. కోర్టులలో పిటిషన్ల ఫైట్‌ కొనసాగుతోంది. ఈ క్రమంలో నేడు విజయవాడలోని ACB కోర్టులో చంద్రబాబు కస్టడీ, బెయిల్ పిటీషన్లపై విచారణ కొనసాగనుంది. మరో అయిదు రోజుల పాటు పోలీస్ కస్టడీ కోరుతూ ఏపీ సిఐడీ పిటీషన్ వేసింది. రెండు రోజుల కస్టడీలో చంద్రబాబు విచారణకు సహకరించలేదని సిఐడి చెబుతోంది. పోలీస్ కస్టడీ పొడిగింపుతో పాటు బెయిల్ పిటిషన్ పైనా నేడు ఒకేసారి వాదనలు కొనసాగనున్నాయి. మరోవైపు చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ సోమవారానికి వాయిదా పడింది. అటు.. ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కేసులో.. చంద్రబాబునాయుడు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు ముగిశాయి. అనంతరం తీర్పును హైకోర్టు రిజర్వ్ చేసింది.

మరోవైపు స్కిల్‌స్కామ్‌ కేసులో లోకేష్ ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై కూడా నేడు ఏపీ హైకోర్టులో విచారణ కొనసాగనుంది. గతంలో జరిగిన విచారణలో నేటి వరకూ లోకేష్‌ను అరెస్ట్‌ చేయవద్దని హైకోర్టు ఆదేశించింది. విచారణను నేటికి వాయిదా వేసింది. ఈ క్రమంలో నేడు మరోసారు కోర్టులో ఇరుపక్షాల వాదనలు కొనసాగనున్నాయి.

కాగా, చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై నిన్న సుప్రీంకోర్టులో వాడీవేడీ వాదనలు జరిగాయి. ప్రధానంగా సెక్షన్ 17ఏ పైనే వాదనలు జరిగాయి. హైకోర్ట్‌ తీర్పులో 17ఏను తప్పుగా అన్వయించారని.. సీఐడీ అభియోగాలు పరస్పరం విరుద్ధంగా ఉన్నాయని, రాజకీయ కక్షతోనే కేసు నమోదు చేశారని చంద్రబాబు తరపు న్యాయవాదులు హరీష్‌ సాల్వే, అభిషేక్ సంఘ్వీ, సిద్ధార్థ లూథ్రా వాదించారు. చంద్రబాబును అరెస్ట్‌ చేసిన విధానం సరిగా లేదని హైకోర్ట్ దృష్టికి తీసుకెళ్లామని.. కానీ హైకోర్ట్ తమ వాదనను అంగీకరించలేదన్నారు. ఆ తర్వాత ఏపీ ప్రభుత్వం తరపు న్యాయవాది ముకుల్ రోహత్గీ కూడా బలంగానే వాదనలు వినిపించారు. చంద్రబాబుకు 17ఏ వర్తించదన్నారు. కేసు దర్యాప్తు 2017 కంటే ముందే ప్రారంభమైంది. అప్పుడే దీన్ని సీబీఐ పరిశీలించింది. రాజకీయ కక్ష ఎలా అంటారని ప్రశ్నించారు ముకుల్. పైగా చంద్రబాబు అరెస్టయిన మూడు రోజుల్లోనే హైకోర్ట్‌లో 2000పేజీలతో కూడిన క్వాష్ పిటిషన్ వేశారన్నారు. పోటాపోటీగా సాగిన వాదనలు విన్న న్యాయస్థానం.. హైకోర్ట్‌లో జరిగిన క్వాష్ పిటిషన్‌కి సంబంధించిన పత్రాలను తమ ముందు ప్రవేశపెట్టాలని సూచించింది. అలాగే విచారణను సోమవారానికి వాయిదావేసింది.