ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని విమర్శించారు బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ. ఏపీ రాజధాని అమరావతిలోనే ఉంచాలని డిమాండ్ చేస్తూ కన్నా లక్ష్మీనారాయణ మౌనదీక్ష చేపట్టారు. రాజధాని కోసం ఉద్దండరాయునిపాలెంలో ప్రధాని నరేంద్రమోదీ శంకుస్థాపన చేసిన స్థలంలోనే కన్నా లక్ష్మీనారాయణ కొద్దిసేపు తన మౌన దీక్ష చేపట్టారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజధాని కోసం రైతులు త్యాగాలు చేశారని అన్నారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి కేంద్రం నిధులిచ్చిందని చెప్పారు. జీఎన్ రావు కమిటీ నివేదిక రాకముందే జగన్ ప్రకటన చేశారని ఆరోపించారు. ముఖ్యమంత్రి జగన్ నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని కన్నా ఆరోపించారు.