
విశాఖపట్నం గజవాక పరిధిలోని తుంగ్లం వద్ద ఘోర ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న రైల్వే అండర్ బ్రిడ్జ్ (RUB) కుప్పకూలిపోయింది. నిర్మాణ పనులు జరుగుతుండగా ఒక్కసారిగా డెక్కింగ్ స్లాబ్ కిందకు ఒరిగిపోయింది. ఈ ప్రమాదంలో ఏడుగురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు.
బ్రిడ్జిపై కాంక్రీట్ వేస్తున్న సమయంలో ఒక్కసారిగా భారీ శబ్దం చేస్తూ నిర్మాణం కుప్పకూలింది. అదే సమయంలో నిర్మాణ పనుల్లో నిమగ్నమైన కార్మికులు చిక్కుకుపోయారు. శిథిలాల కింద చిక్కుకున్న ఏడుగురు కార్మికులను స్థానికులు, పోలీసులు రక్షించి చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. దువ్వాడ రైల్వే స్టేషన్ సమీపంలోని పాత బ్రిడ్జి ఇరుకుగా ఉండటంతో, నిత్యం ట్రాఫిక్ కష్టాలు ఎదురవుతున్నాయి. దీనికి పరిష్కారంగా చేపట్టిన కొత్త బ్రిడ్జి నిర్మాణంలో ఉండగానే ఈ అపశ్రుతి చోటుచేసుకుంది.
ప్రస్తుతం గాజువాక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నారు. ప్రమాదానికి గల సాంకేతిక కారణాలపై అధికారులు విచారణ జరుపుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
వీడియో ఇక్కడ చూడండి…
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..