
సాగర నగరం విశాఖలో ఒక్కసారిగా అలజడి.. ఈ తెల్లవారుజామున జనం బయటకు పరుగులు తీశారు. భూ ప్రకంపనలు వణుకు పుట్టించాయి. ఇంట్లో అప్పుడప్పుడే నిద్ర నుంచి లేస్తున్న వారు కొందరు.. వాకింగ్ కోసం బయటకు వెళ్ళిన వారు మరి కొంతమంది భయభ్రాంతులకు గురయ్యారు. నగరంలోని పలు ప్రాంతాల్లో స్వల్ప భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. రిక్టర్ స్కేలుపై ఈ భూకంప తీవ్రత 4.5గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (NCS) అధికారికంగా ప్రకటించింది. ఈ తెల్లవారుజామున 5:05:46 గంటలకు ఈ ఘటన జరిగింది.
విశాఖలో భూప్రకంపనల కుదుపు ఆందోళన నింపింది. గాఢ నిద్రలో ఉన్న నగర వాసులు ఒక్కసారిగా వచ్చిన ఊపునకు ప్రాణభయంతో ఇళ్ల నుంచి రోడ్లపైకి పరుగులు తీశారు. సాగర్ నగర్, తాటిచెట్లపాలెం, సీతమ్మధార, అప్పుఘర్ మాధవధార, పెద వాల్తేరు, ఎంవీపి కాలనీ, ఈస్ట్ పాయింట్ కాలనీ, హెచ్ బి కాలనీ
సహా పలు ప్రాంతాల్లో ప్రకంపనలు సంభవించాయి.
భూప్రకంపనలు అధికారికంగా నేషనల్ సెంటర్ ఫర్ సైస్మాలజీ ధ్రువీకరించింది. ఈ ఉదయం 5:05:46 గంటలకు భూ ప్రకంపనలు సంభవించినట్టు ప్రకటించింది. రిక్టర్ స్కెల్ పై 4.5 మ్యాగ్నిట్యూడ్ గా రికార్డ్ అయినట్టు తెలిపింది. బంగాళాఖాతంలో భూకంపక కేంద్రం.. పది కిలోమీటర్ల లోతులో సంభవించినట్టు అధికారికంగా పేర్కొంది. కాకినాడకు తూర్పున 227 కిలోమీటర్ల దూరంలో సముద్రంలో ఈ భూకంప కేంద్రం ఉన్నట్టు నిర్ధారించింది. తీర ప్రాంత నగరం కావడంతో విశాఖలో భూ ప్రకంపనల ప్రభావం కొన్ని సెకన్ల పాటు కనిపించింది.
అయితే.. భూ ప్రకంపనలతో ఎక్కడా ఎలాంటి నష్టం సంభవించలేదు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే.. ఈ మధ్యకాలంలో వచ్చిన భూ ప్రకంపనల తీవ్రతతో పోలిస్తే.. ఈరోజు సంబంధించిన కాస్త ఎక్కువేనని అంటున్నారు జియాలజీ నిపుణులు. ‘4.5 తీవ్రత తో 10కిలోమీటర్ల లోతు సముద్రంలో భూకంపాక కేంద్రం గుర్తించారు. ఇది షాలో ఎర్త్ క్వెక్. బంగాళాఖాతంలోనూ కొన్ని ఫాల్ట్ జోన్స్ ఉన్నాయి. వాటి రియాక్షన్ ఈ భూప్రకంపనలకు కారణం కావచ్చు.’అని టీవీ9తో అన్నారు ఏ యు జియాలజీ ప్రొఫెసర్ యుగంధర్ రావు..