
అన్నమయ్య జిల్లా పీలేరు పరిధిలోని పౌల్ట్రీ ఫామ్లో బర్త్ ఫ్లూ భయం హడలెత్తిస్తోంది. ఇప్పటికే 3 గ్రామాల్లో 24 వేలకు పైగా కోళ్లు అంతుచిక్కని కారణాలతో మృత్యువాత పడ్డాయి. సదుం మండలం పుట్టావాండ్ల పల్లి, కంభంవారిపల్లి, అమ్మగారి పల్లి గ్రామాల్లోని పౌల్ట్రీఫామ్స్లో కోళ్లకు బర్డ్ ఫ్లూ సోకినట్టు వెటర్నరీ అధికారులు ప్రాథమికంగా నిర్దారించారు. చనిపోయిన కోళ్లను తగిన జాగ్రత్తలతో పూడ్చివేశారు. శాంపిల్స్ను సేకరించి భోపాల్లోని హై సెక్యూరిటీ ల్యాబ్కు తరలించారు. రిపోర్ట్ వచ్చాక మరింత స్పష్టత వస్తుందన్నారు. ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. వెటర్నరీ, పోలీస్, రెవెన్యూ, పంచాయతీ రాజ్ శాఖ అధికారులు, సిబ్బంది పల్లెపల్లెన అవగాహన కల్పిస్తున్నారు. మాస్క్ను ధరించడం సహా పది రోజుల పాటు చికెన్, ఎగ్స్ను తినకపోవడం మంచిదని ప్రజలకు సూచించారు. దగ్గు, జలుబు, జ్వరం వంటి సమస్యలు ఉంటే వెంటనే డాక్టర్లను సంప్రదించాలన్నారు. ఎప్పటికప్పుడు సీఏం కార్యాలయానికి నివేదికలు పంపిస్తున్నారు అధికారులు. బర్డ్ ఫ్లూ వల్ల నష్ట పోయిన పౌల్టీ రైతులకు నష్ట పరిహారం చెల్లిస్తామని ప్రకటించారు జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.