

మయన్మార్లో మారణహోమం: మయన్మార్కు స్వాతంత్ర్యం వచ్చాక ఐదు దశాబ్దాల పాటు సైనిక పాలన కొనసాగిన అనంతరం.. ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికలు జరిగాయనుకున్న క్రమంలో ఈ ఏడాది జరిగిన పరిణామాలు దేశ భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చాయి. బర్మాలో ప్రజాస్వామ్యం కోసం ఎన్నో ఏండ్లు పోరాడి గృహ నిర్బంధంలో గడిపిన నోబెల్ శాంతి బహుమతి ఆంగ్ సాన్ సూకీని డెమోక్రసీ జాతీయ లీగ్ తరుపున బాధ్యతలను చేపట్టారు. ఈ క్రమంలో మయన్మార్ అంతర్గత సంఘర్షణ, రాజకీయ సంక్షోభం మధ్య ఫిబ్రవరిలో ఆమె కొన్ని చట్టాలను ఉల్లఘించారని.. ఆమెను నిర్భంధంలోకి తీసుకొని.. సైనిక జుంటా అధికారాన్ని చేజిక్కించుకున్నారు. సూకీతోపాటు రాజకీయ నేతలందరినీ నిర్బంధించడంతో ఆందోళనలు, మారణహోమం చెలరేగింది. ఈ ఆందోళనల్లో వేలాది మంది మరణించారు.

ఆప్గానిస్తాన్ - తాలిబాన్ల పాలన: ఆఫ్ఘానిస్తాన్ భూభాగాల నుంచి అమెరికా సైన్యం వైదొలిగిన అనంతరం తాలిబాన్ తీవ్రవాదులు పాలనపై కన్నేశారు. ఆప్గాన్ సైన్యంపై దండేత్తి అన్ని ప్రధాన నగరాలను ఒక్కొక్కటి చేజిక్కించుకున్నారు. ఈ క్రమంలో అఫ్ఘాన్ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ దేశం విడిచి పారిపోయారు. దీంతో అప్గానిస్తాన్ కాస్తా తాలిబన్ రాజ్యంగా మారిపోయింది. దీంతో ఆఫ్ఘాన్లో ఇప్పటికీ దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. తాలిబన్లు కఠినమైన షరియత్ చట్టాలను విధిస్తూ ఇప్పటికీ దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. దాదాపు దేశం నుంచి లక్షలాది మంది పారిపోగా.. వేలాది మంది తాలిబాన్ల క్రూరత్వానికి బలయ్యారు.

కోవిడ్ సెకండ్ వేవ్- డేల్టా, ఒమిక్రాన్ వేరియంట్లు: కరోనా భూతంతో అప్పుడప్పుడే కోలుకుంటున్న ప్రపంచాన్ని.. మళ్లీ సెకండ్ కాకలవికలం చేసింది. కరోనా సెకండ్ వేవ్లో లక్షలాది మంది మరణించగా.. కోటి మందికి పైగా ప్రజలు వైరస్ బారిన పడ్డారు. కరోనా సెకండ్ వేవ్ సమయంలో.. వైద్య సంక్షోభం, వ్యాక్సినేషన్, ఆక్సిజన్ లాంటి సమస్యలు చాలా దేశాలను వణికించాయి. చాలా దేశాలు లాక్డౌన్తో వైరస్ను ఎదుర్కొన్నాయి. ఆ తర్వాత ప్రపంచాన్ని డెల్టా, ఒమిక్రాన్ వేరియంట్లు ప్రపంచాన్ని కుదిపేశాయి. తాజాగా దక్షిణాఫిక్రాలో వెలుగులోకి వచ్చిన ఒమిక్రాన్ వేరియంట్.. థర్డ్ వేవ్కు దారి తీస్తుందని పలు అధ్యయనాలు పేర్కొంటున్నాయి. ఈ తరుణంలో మళ్లీ ప్రపంచం.. కొత్త వేరియంట్ను ఎదుర్కొనేందుకు సమాయత్తమవుతోంది.

ఇథియోపియాలో ప్రజా తిరుగుబాటు: ఇథియోపియాలో టిగ్రే ప్రజా తిరుగుబాటు ఈ ఏడాది ఆ దేశంలో విషాదాన్ని నిపింది. ప్రభుత్వ దళాలు, మానవతా ఆర్థిక సంక్షోభాలను ప్రేరేపించిన 13 నెలల సంఘర్షణ తర్వాత టిగ్రేయన్ అసమ్మతివాదులకు వ్యతిరేకంగా పెద్ద పురోగతి లభించింది. ఇథియోపియా ప్రధాని అబీ అహ్మద్ కూడా టిగ్రే తిరుగుబాటుల దారులకు వ్యతిరేకంగా పోరాటం చేశారు. అబీ అహ్మద్ను పదవి నుంచి దించేందుకు టిగ్రే తిరుగుబాటుదారులు పెద్ద ఎత్తున హింసకు పాల్పడ్డారు. ఈ పోరాటంలో ఇథియోపియా సైన్యం కూడా ప్రధాన పాత్ర పోషించింది. ఏడాదికి పైగా సాగుతున్న ఈ సంక్షోభం వేలాది మంది ప్రాణాలను బలిగొంది. ఈ తిరుగుబాటు యుద్ధంలో ప్రధానమంత్రికి విస్తృత మద్దతు ఉంది.

సూయజ్ కాల్వ.. కార్గో షిప్ ప్రమాదం: ప్రపంచ దేశాలకు చమురును సప్లై చేయడానికి ఉపయోగించే సూయజ్ కాలువలో కార్గో షిప్ చిక్కుకోవడం అత్యంత ముఖ్యమైన సంఘటనగా నిలించింది. ఈ కాలువలో రోజూ వందలాది భారీ నౌకలు రాకపోకలు సాగిస్తుంటాయి. ఈ క్రమంలో ఎవర్ గ్రీన్ నౌక మార్చిలో చైనా నుంచి నెదర్లాండ్స్ వెళ్తూ సూయజ్ కాలువలో చిక్కుకుపోయింది. దీంతో ఈ ఘటన అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది. ఈ నౌకను కదిలించడానికి దాదాపు నెలపట్టింది. నౌక ఘటనతో ప్రపంచ దేశాలు లబోదిబోమన్నాయి. చమురు ధరలు కూడా పెరిగాయి. ఈజిప్టు ప్రభుత్వం నౌక యజామాన్యానికి కూడా జరిమానా విధించారు. దీంతో అంతర్జాతీయ వాణిజ్య రంగం కుదేలయ్యింది.

అంతరిక్ష ప్రయోగాలపై చైనా కన్ను: ఈ ఏడాది చైనా అంతరిక్ష ప్రయోగాలపై దృష్టి సారించింది. చైనా తమ ఆధిపత్యాన్ని అంతరిక్షంలో పెంచుకునేందుకు ఈ ప్రయోగాలను చేపట్టింది. డ్రాగన్ కంట్రీ మాత్రం ఎడారుల్లో ఏర్పాటు చేసిన అంతరిక్ష ప్రయోగ కేంద్రాల ద్వారా ఈ విధమైన మిషన్ లను కామ్ గా చేసుకునిపోతోంది. చైనా కొత్తగా నిర్మించిన తైన్ గోంగ్ స్పేస్ స్టేషన్ నుంచి వ్యోమగాములను జూన్లో అంతరిక్షంలోకి పంపింది. షెంజౌ-12 వ్యోమనౌక ద్వారా ముగ్గురు వ్యోమగాములను పంపిన చైనా.. అక్కడ సొంతంగా స్పేస్ స్టేషన్ నిర్మాణాన్ని చేపట్టనున్నట్లు వెల్లడించింది. అమెరికాకు ధీటుగా చైనా ఈ ప్రయోగాలను ప్రారంభించింది.

జెఫ్ బెజోస్ అంతరిక్ష యాత్ర: అపర కుబేరుడు బ్లూ ఆరిజిన్ అధినేత జెఫ్ బెజోస్ అంతరిక్ష యాత్ర చేపట్టారు. అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ ‘బ్లూ ఆరిజిన్’కు చెందిన ‘న్యూ షెపర్డ్’ వ్యోమనౌకలో జూలైలో అంతరిక్షయాత్ర చేపట్టారు. పశ్చిమ టెక్సాస్ నుంచి ‘న్యూ షెపర్డ్’ రాకెట్ ద్వారా ‘సబ్ ఆర్బిటల్’ యాత్ర చేశారు. జెఫ్ బెజోస్ మరో ముగ్గురితో కలిసి ఈ యాత్ర చేప్టారు. చంద్రుడిపై మానవుడు తొలిసారిగా కాలుమోపిన రోజునే ఈ చరిత్రాత్మక యాత్ర కోసం బెజోస్ ఎంచుకున్నారు. ఈ యాత్రలో ప్రపంచంలోనే అత్యంత పెద్ద, చిన్న వయసు వ్యోమగాములు కూడా ఉన్నారు. ‘వర్జిన్ గెలాక్టిక్’ సంస్థ వ్యవస్థాపకుడు రిచర్డ్ బ్రాన్సన్ విజయవంతంగా అంతరిక్ష యాత్ర చేపట్టిన అనంతరం జెఫ్ బెజోస్ ఈ యాత్ర నిర్వహించారు.

టోక్యో ఒలింపిక్స్: 2020 నిర్వహించాలనుకున్న టోక్యో ఒలింపిక్స్ కరోనా మహమ్మారి కారణంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. కఠిన కరోనా నిబంధనలతో ఈ ఒలిపింక్స్ జూలై 23 నుంచి ఆగస్టు 8 వరకు జరిగాయి. దాని తర్వాత పారా ఒలింపిక్స్ను నిర్వహించారు. ఈ టోక్యో ఒలింపిక్స్లో అత్యధికంగా అమెరికా 39 బంగారు పతకాలు సాధించగా.. చైనా 38 పతకాలు సాధించి రెండో స్థానంలో నిలించింది. 27 పతకాలతో జపాన్ మూడో స్థానంలో నిలిచింది. ఈ ఒలింపిక్స్లో భారత్ 7 పతకాలను సాధించింది. గోల్డ్ 1, సిల్వర్ 2, రజతం 4 పతకాలను సాధించింది.

స్పేస్ ఎక్స్ కొత్త చరిత్ర: అమెరికాకు చెందిన ప్రైవేటు దిగ్గజ అంతరిక్ష సంస్థ స్పేస్ ఎక్స్ కొత్త చరిత్రను తిరగరాసింది. నలుగురు సామాన్యులతో కూడిన రాకెట్ను సెప్టెంబరులో నింగిలోకి పంపి అరుదైన ఘనత సాధించింది. ఈ ప్రాజెక్టుకు ‘స్పేస్ఎక్స్ - ఇన్స్పిరేషన్ 4’ అనే పేరు పెట్టి స్పేస్ ఎక్స్ ఈ ప్రాజెక్టును రూపొందించింది. దీనిద్వారా నలుగురు సామాన్య వ్యక్తలు అంతరిక్షంలో మూడు రోజులు గడిపారు. వ్యోమగాములు కాకుండా.. సామాన్య పౌరులతో కూడిన ఓ ప్రైవేటు రాకెట్ భూకక్ష్యలో ప్రయాణించడం ఇదే తొలిసారి. ఈ పరిశోధన ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.