
పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు మరింత ముదిరాయి. ఇరాన్లోని కీలకమైన బుషెహర్ అణు విద్యుత్ కేంద్రం లక్ష్యంగా అమెరికా ఇజ్రాయెల్ దళాలు జరిపిన దాడులను ఆ దేశ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చి తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు ఆయన ఐక్యరాజ్యసమితికి ఒక అధికారిక లేఖ రాస్తూ.. ఈ దాడులు కేవలం ఇరాన్కే కాకుండా మొత్తం ప్రాంతానికే పెను ప్రమాదమని హెచ్చరించారు. టెలిగ్రామ్ వేదికగా తన లేఖను పంచుకున్న అరాఘ్చి.. అణు కేంద్రం సమీపంలో దాడులు జరగడం వల్ల రేడియోధార్మిక కాలుష్యం వెలువడే ప్రమాదం ఉందని తెలిపారు. దీనివల్ల తీవ్రమైన మానవ, పర్యావరణ పరిణామాలు సంభవిస్తాయని ఆయన నొక్కి చెప్పారు. ‘‘క్రియాశీలకంగా ఉన్న అణు కేంద్రానికి సమీపంలో ఈ దాడులు జరగడం భరించలేని పరిస్థితి. ఇది రేడియోధార్మిక విడుదల ద్వారా మొత్తం ప్రాంతాన్ని ప్రమాదంలోకి నెట్టే చర్య’’ అని అరాఘ్చి ఆందోళన వ్యక్తం చేశారు.
ఇరాన్ వార్తా సంస్థ తస్నిమ్ నివేదిక ప్రకారం.. శనివారం ఉదయం బుషెహర్ ప్లాంట్ సమీపంలోకి దూసుకొచ్చిన క్షిపణి కారణంగా ఒక భద్రతా సిబ్బంది మరణించారు. ఈ దాడిలో ప్రధాన ప్లాంట్కు నష్టం వాటిల్లనప్పటికీ, ఒక సహాయక భవనం ధ్వంసమైంది. ప్రస్తుతం విద్యుత్ ఉత్పత్తికి ఎలాంటి ఆటంకం కలగలేదని అధికారులు స్పష్టం చేశారు. రష్యా సహకారంతో నడుస్తున్న ఈ బుషెహర్ కేంద్రం.. తక్కువ-సుసంపన్నమైన యురేనియంను ఉపయోగించి సుమారు 1,000 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేస్తూ ఇరాన్ ఇంధన అవసరాల్లో కీలక పాత్ర పోషిస్తోంది.
మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన హెచ్చరికల పదును పెంచారు. హోర్ముజ్ జలసంధి విషయంలో ఇరాన్కు ట్రంప్ 48 గంటల గడువుతో కూడిన మూడవ అల్టిమేటం జారీ చేశారు. ‘‘ఇరాన్లో మిగిలి ఉన్న మౌలిక సదుపాయాలను నాశనం చేయడం అమెరికా సైన్యం ఇంకా మొదలుపెట్టనే లేదు’’ అంటూ ట్రంప్ ట్రూత్ సోషల్ వేదికగా హెచ్చరించారు. మున్ముందు వంతెనలు, విద్యుత్ కేంద్రాలే లక్ష్యంగా దాడులు ఉండవచ్చని ఆయన సంకేతాలిచ్చారు.
ఇదే సమయంలో తన పైలట్ కుమారుడు కనిపించడం లేదని ఆందోళన వ్యక్తం చేసిన ఒక అమెరికా మహిళను ఇరాన్ ప్రభుత్వం మందలించడం చర్చనీయాంశమైంది. ఇరాన్
అణు కార్యక్రమాన్ని సమూలంగా నాశనం చేయడమే లక్ష్యంగా గత నెల రోజులుగా అమెరికా-ఇజ్రాయెల్ దళాలు వరుస దాడులు చేస్తున్న నేపథ్యంలో, తాజా ఘటనలు ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్నాయి.
Remember the Western outrage about hostilities near Zaporizhzhia Nuclear Power Plant in Ukraine?
Israel-U.S. have bombed our Bushehr plant four times now. Radioactive fallout will end life in GCC capitals, not Tehran.
Attacks on our petrochemicals also convey real objectives. pic.twitter.com/onGCgkJFjt
— Seyed Abbas Araghchi (@araghchi) April 4, 2026