
Facebook And Instagram: భవిష్యత్తులో 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఉండదేమో. చిన్నప్పుడే సోషల్ మీడియాకు అడిక్ట్ కావడం, మొబైల్స్కు అతుక్కుపోవడం వల్ల మానసికంగా చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పిల్లలు చదువులకు దూరమై తమ బాల్యాన్ని పొగోట్టుకుంటున్నారు. దీంతో ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, స్నాప్షాట్ వంటి సోషల్ మీడియా యాప్స్ను పిల్లలు వాడకుండా నిషేధం విధించే అకాశముంది. ప్రపంచవ్యాప్తంగా రాబోయే రోజుల్లో ఇది జరగనుందా..? అంటే అవుననే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
ఇప్పటికే ఆస్ట్రేలియా ప్రభుత్వం 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా వాడకుండా బ్యాన్ అమల్లోకి తీసుకురాగా.. అదే బాటలో మిగతా దేశాలు నుడుస్తున్నాయి. తాజాగా మలేషియా ప్రభుత్వం కూడా అదే రూల్ తమ దేశంలో తీసుకురానుంది. ఈ మేరకు మలేషియా కమ్యూనికేషన్ల శాఖ మంత్రి ఫాహ్మి ఫడ్జిల్ ఈ ప్రకటన చేశారు. వచ్చే ఏడాది నాటికి 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా వాడకుండా నిషేధం అమల్లోకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. ఆస్ట్రేలియా తీసుకొచ్చిన నిబంధనలను పరిశీలిస్తున్నామని, త్వరలో తాము కూడా అలాంటి నిర్ణయం తీసుకుంటామన్నారు. పిల్లల భవిష్యత్తును కాపాడటంతో పాటు సైబర్ నేరాల క్రమంలో ఇప్పటికే మలేషియా ప్రభుత్వం సోషల్ మీడియాపై కఠిన నిబంధనలను అమల్లోకి తెచ్చింది.
సెప్టెంబర్లో విడుదలైన ఓ సర్వేలో 72 శాతం మంది పిల్లలు సోషల్ మీడియా వాడుతున్నట్లు వెల్లడైంది. దీంతో సోషల్ మీడియాతో బ్యాన్ విధించాలని మలేషియా ప్రభుత్వం చూస్తోంది. ఇక ఇప్పటికే న్యూజిలాండ్, స్పెయిన్, ఇటరీ, ఫ్రాన్స్, నెదర్లాండ్స్ వంటి దేశాలు సోషల్ మీడియాలో పిల్లలు హానికర కంటెంట్ వాడటంపై నిబంధనలు అమల్లోకి తెచ్చాయి.