అటు అగ్నిపర్వతం బద్దలు.. ఇటు 235 సార్లు భూకంపం.. ఆ దేశంపై పగబట్టిన ప్రకృతి

అగ్నిపర్వత పేలుడు, వరుస భారీ భూకంపాలతో ఇండోనేషియా వణికిపోయింది. మౌంట్‌ ఇబు అగ్నిపర్వతం నుంచి భారీగా బూడిద ఎగసిపడిన కొద్దిసేపటికే ఫ్లోరెస్‌ తీరంలో 7.7 తీవ్రతతో భూకంపం సంభవించింది. గంటన్నరలో ఐదుసార్లు ప్రకంపనలు రావడంతో ఈస్ట్‌ నుసా టెంగారా ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. 3 మీటర్ల వరకు అలలు ఎగసిపడే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.

అటు అగ్నిపర్వతం బద్దలు.. ఇటు 235 సార్లు భూకంపం.. ఆ దేశంపై పగబట్టిన ప్రకృతి
Indonesia Earthquake

Updated on: Aug 16, 2026 | 9:18 AM

ఒకేసారి జరిగిన ప్రకృతి విపత్తులు ఇండోనేషియాను కుదిపేశాయి. ఒకవైపు వరుసగా వచ్చిన భూకంపాలు, మరోవైపు అగ్నిపర్వతం బద్ధలవడంతో ఇండోనేషియా చిగురుటాకులా వణికిపోయింది. ఇండోనేషియాలో భారీ అగ్నిపర్వతం పేలిన కాసేపటికే వరుస భారీ భూకంపాలు ఆదేశాన్ని వణికించాయి. హల్మహెరా ప్రాంతంలోని మౌంట్‌ ఇబు అగ్నిపర్వతం పేలిపోవడంతో దాదాపు 5 కిలోమీటర్ల ఎత్తుకు బూడిద ఎగసిపడింది. ఆయా పరిసర ప్రాంతాల్లో అధికారులు ఎమర్జెన్సీ ప్రకటించారు. అగ్నిపర్వతం పేలిన కొన్ని గంటలకే ఫ్లోరెస్‌ తీరంలో భారీ భూకంపం నమోదయింది. 7.7 తీవ్రతతో నమోదైన ఈ భూకంపం.. కేవలం 10 కిలోమీటర్ల లోతులోనే కేంద్రీకృతమైంది. గంటన్నర వ్యవధిలో వరుసగా ఐదుసార్లు భూమి కంపించింది. 5, 5.1, 6.1, 5.6, 5.9 తీవ్రతతో ప్రకంపనలు నమోదయ్యాయి. ఈ విపత్తులకు 47మందికిపైగా మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. 7.7 తీవ్రతతో సంభవించిన భూకంపం తర్వాత, సుమారు 6.1 తీవ్రతతో కూడిన శక్తివంతమైన ప్రకంపనతో సహా 235కి పైగా ప్రకంపనలు సంభవించాయని ఇండోనేషియా అధికారులు తెలిపారు.. 24 గంటల వ్యవధిలో ఇండోనేషియాలో మూడు ప్రధాన భూకంపాలు సంభవించాయని.. చాలా ప్రాంతాల్లో విపత్కర పరిస్థితులు నెలకొన్నాయని మీడియా నివేదించింది. శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. అయితే.. మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని పేర్కొంటున్నారు.

భూకంపం నేపథ్యంలో ఈస్ట్‌ నుసా, టెంగారా ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. తీర ప్రాంతాలు, నదీ పరివాహక ప్రాంతాల నుంచి దూరంగా వెళ్లిపోవాలని ప్రజలను ఆదేశించారు. 3 మీటర్ల ఎత్తులో కెరటాలు ఎగసిపడే అవకాశముందని హెచ్చరించారు. ఓవైపు అగ్నిపర్వత పేలుడు, మరోవైపు తీవ్ర భూకంపంతో ఇండోనేషియా వ్యాప్తంగా తీవ్ర భయాందోళనలు నెలకున్నాయి.

భూకంపం తీవ్రతకు ఫ్లోరెస్‌ దీవిలోని పలు భవనాలు దెబ్బతిన్నాయి. మౌమెరే ప్రాంతంలోని పోర్టు టెర్మినల్‌ వెయిటింగ్‌ రూమ్‌ కూలిపోయింది. పలు ప్రాంతాల్లో ఇళ్లు, గిడ్డంగులు, ప్రభుత్వ భవనాలు దెబ్బతిన్నాయి. విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.

ఆసుపత్రుల్లోనూ భయానక పరిస్థితులు నెలకొన్నాయి. రోగులను భద్రత దృష్ట్యా బయటకు తరలించారు. బెడ్లు, ఆక్సిజన్‌ సిలిండర్లు, వైద్య పరికరాలను బయట ఏర్పాటు చేసి తాత్కాలిక చికిత్స కేంద్రాలు ఏర్పాటు చేశారు. కాగా.. ఇండోనేషియాతోపాటు.. వెనిజూలా సహా.. చాలా దేశాల్లో ప్రకంపనలు సంభవించాయి.


మరిన్ని ప్రపంచ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us