US: అమెరికాలో చదువుతున్న భారత విద్యార్థులకు విదేశాంగ శాఖ హెచ్చరిక!

|

Mar 22, 2025 | 5:26 PM

అమెరికాలోని జార్జ్‌టౌన్ విశ్వవిద్యాలయంలో పోస్ట్‌డాక్టోరల్ విద్యార్థి బదర్ ఖాన్ సూరి అరెస్టు, కొలంబియా విశ్వవిద్యాలయ విద్యార్థిని రంజని శ్రీనివాసన్ అమెరికా నుండి నిష్క్రమణపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన చేసింది. విద్యార్థులు అమెరికన్ చట్టాలను పాటించాలని MEA స్పష్టం చేసింది. ఇద్దరు విద్యార్థులు సాయం కోసం భారత మిషన్లను సంప్రదించలేదని తెలిపింది. వీసా, ఇమ్మిగ్రేషన్ విధానాలు ఆయా దేశాల సార్వభౌమత్వానికి సంబంధించినవని MEA పేర్కొంది.

US: అమెరికాలో చదువుతున్న భారత విద్యార్థులకు విదేశాంగ శాఖ హెచ్చరిక!
Mea Spokesperson Randhir Ja
Follow us on

అమెరికా ప్రభుత్వాధికారులు జార్జ్‌టౌన్ యూనివర్సిటీలో పోస్ట్‌డాక్టోరల్ విద్యార్థిని అదుపులోకి తీసుకోవడం, కొలంబియాకు చెందిన మరో విద్యార్థినిని అమెరికా నుంచి తనకు తానుగా వెళ్లిపోయేలా చేయడంతో భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన చేసింది. అమెరికాలోని భారతీయ విద్యార్థులు అమెరికన్ చట్టాలను పాటించాలని విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) శుక్రవారం స్పష్టం చేసింది. ఈ అంశంపై విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ.. అమెరికా చర్యలకు గురైన ఇద్దరు భారతీయ విద్యార్థులు సాయం కోసం అమెరికాలోని భారత మిషన్లను సంప్రదించలేదని అన్నారు. వాషింగ్టన్ డీసీలోని జార్జ్‌టౌన్ యూనివర్సిటీలో పోస్ట్‌డాక్టోరల్ విద్యార్థి బదర్ ఖాన్ సూరిని హమాస్‌కు మద్దతుగా ప్రచారం చేస్తున్నాడనే అనే ఆరోపణలపై హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం సోమవారం రాత్రి అతన్ని అదుపులోకి తీసుకుంది.

అలాగే కొలంబియా యూనివర్సిటీలో రంజని శ్రీనివాసన్ హింస, ఉగ్రవాదాన్ని సమర్థిస్తూ హమాస్‌కు మద్దతు ఇచ్చే కార్యకలాపాలలో పాల్గొన్నారనే ఆరోపణలతో ఆమె వీసా రద్దు చేశారు. ఆమె స్వయంగా కెనడాకు వెళ్లిపోయాలా చర్యలు తీసుకున్నారు. అంశంపై జైస్వాల్‌ మాట్లాడుతూ.. వీసా, ఇమ్మిగ్రేషన్ విధానంపై నిర్ణయాలు ఆయా దేశాల ప్రత్యేక హక్కు అని, సంబంధిత చట్టాలను పాటించాలని జైస్వాల్ అన్నారు. వీసా, ఇమ్మిగ్రేషన్ విధానం విషయానికి వస్తే, అది ఒక దేశపు సార్వభౌమ విధుల్లో ఉంటుందని, మా దేశానికి విదేశీ పౌరులు వచ్చినప్పుడు ఎలాగైతే భారత చట్టాలని గౌరవించాలని భావిస్తామో, అలాగే భారతీయ పౌరులు విదేశాలలో ఉన్నప్పుడు, వారు స్థానిక చట్టాలను కచ్చితంగా పాటించాలని మేం ఆశిస్తున్నాం అని అన్నారు.

బదర్ ఖాన్ సూరిను అదుపులోకి తీసుకోవడంపై జైస్వాల్ స్పందిస్తూ.. అతన్ని అదుపులోకి తీసుకున్నట్లు మీడియా నివేదికల ద్వారా మాకు తెలిసిందని, ఈ విషయమై అతను కానీ, అమెరికా ప్రభుత్వం కానీ భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించలేదని అన్నారు. అలాగే రంజని కేసు గురించి జైస్వాల్ మాట్లాడుతూ.. ఆమె సహాయం కోసం భారత రాయబార కార్యాలయాన్ని లేదా అమెరికాలోని ఏదైనా కాన్సులేట్‌ను సంప్రదించిన విషయం తమకు తెలియదని అన్నారు. మార్చి 5న విదేశాంగ శాఖ ఆమె వీసాను రద్దు చేసింది. మార్చి 11న రంజని కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ (CBP) హోమ్ యాప్‌ను ఉపయోగించి అమెరికా విడిచి వెళ్లినట్లు హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం తెలిపింది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.