పాక్‌ పోర్టులో సౌదీ పెట్టుబడులు.. తెరవెనుక చైనా.. భారత్‌కు సవాళ్లు

Updated on: Dec 21, 2025 | 4:41 PM

పాకిస్థాన్‌లోని గ్వాదర్ పోర్టును సైనిక కేంద్రంగా మార్చేందుకు సౌదీ-పాక్ ఒప్పందం కుదిరింది. వాణిజ్య ప్రయోజనాలని చెబుతున్నా, దీర్ఘకాలిక వ్యూహాత్మక సైనిక లక్ష్యాలు, చైనా హస్తం ఉన్నాయని నిపుణులు అనుమానిస్తున్నారు. అరేబియా సముద్రంలో సౌదీ ప్రాబల్యం, చైనా ఆర్థిక కారిడార్ విస్తరణ భారత్‌కు కొత్త సవాళ్లను విసిరే అవకాశం ఉంది.

పాకిస్థాన్‌లోని గ్వాదర్ పోర్టును సైనిక కేంద్రంగా మార్చేందుకు సౌదీ అరేబియా ఓ ప్లాన్‌తో ముందుకొచ్చింది. పాకిస్థాన్‌తో కలిసి ఈ పోర్టును అభివృద్ధి చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. వాణిజ్య, రవాణా ప్రయోజనాలే ప్రధానమని చెబుతున్నా భవిష్యత్తులో దీనిని సైనిక అవసరాలకు కూడా ఉపయోగించుకునే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ మొత్తం పరిణామం వెనుక చైనా హస్తం ఉందన్న అనుమానాలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ ఒప్పందంలో భాగంగా గ్వాదర్ పోర్టులో సౌదీ భారీగా పెట్టుబడులు పెట్టనుంది. గ్వాదర్-కరాచీ కోస్టల్ హైవేను అభివృద్ధి చేసి సరుకు రవాణా సామర్థ్యాన్ని పెంచనున్నారు. అలాగే కరాచీ, గ్వాదర్, జెడ్డా, దమ్మామ్‌లను కలుపుతూ ఇంటిగ్రేటెడ్ లాజిస్టిక్స్ పార్కులను ఏర్పాటు చేయాలని సౌదీ యోచిస్తోంది. కరాచీ, గ్వాదర్, జెడ్డాతో పాటు సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ కలల ప్రాజెక్ట్ అయిన నియోమ్ నగరాన్ని కలుపుతూ సంయుక్త మారిటైమ్ టూరిజం కారిడార్‌ను కూడా ప్రతిపాదించారు. వ్యూహాత్మక సహకారంలో భాగంగా గ్వాదర్‌లో ‘రీజనల్ మారిటైమ్ ఫ్యూజన్ అండ్ రెస్పాన్స్ సెంటర్‌’ను ఏర్పాటు చేయనున్నారు. ఇరాన్, ఒమన్, గల్ఫ్ దేశాలతో కలిసి సంయుక్త నౌకాదళ విన్యాసాలకు, శిక్షణకు ఇది కేంద్రంగా పనిచేస్తుంది. అరేబియా సముద్రంలో సైనిక కేంద్రాన్ని ఏర్పాటు చేయాలనేది సౌదీ లక్ష్యమని, దీని వెనుక చైనా హస్తం ఉందని నిపుణులు ఆరోపిస్తున్నారు. కేవలం వాణిజ్యమే లక్ష్యమైతే, గత సెప్టెంబరులో పాకిస్థాన్‌తో సౌదీ సైనిక ఒప్పందం ఎందుకు చేసుకుంటుందని వారు ప్రశ్నిస్తున్నారు. చైనా అనుమతి లేకుండా పాకిస్థాన్‌లో కనీసం దోమ కూడా కదలదని వారు వ్యాఖ్యానిస్తున్నారు. తైవాన్, భారత్‌తో భవిష్యత్తులో తలెత్తే ఘర్షణలను దృష్టిలో ఉంచుకుని, మలక్కా జలసంధికి ప్రత్యామ్నాయంగా చైనా ఈ ఆర్థిక కారిడార్‌ను అభివృద్ధి చేస్తోందని హెచ్చరిస్తున్నారు. గ్వాదర్ పోర్టులో సౌదీ అరేబియా ప్రాబల్యం పెరగడం కేవలం పెట్టుబడులకే పరిమితం కాదని, అరేబియా సముద్రం, హార్ముజ్ జలసంధి, హిందూ మహాసముద్రంలో దీర్ఘకాలిక వ్యూహాత్మక ప్రయోజనాలతో ముడిపడి ఉందని స్పష్టమవుతోంది. ఈ పరిణామం భవిష్యత్తులో భారత్‌కు కొత్త సవాళ్లను విసిరే అవకాశం ఉందంటున్నారు నిపుణులు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

నెరవేరిన ఎమ్మెల్యే శపథం.. నాలుగేళ్ల తర్వాత ఏం చేశాడంటే

అబ్బా.. ఏం వాడకమయ్యా.. రైతన్న తెలివికి సలాం కొట్టాల్సిందే!

గర్భిణీ శవాన్ని ఊర్లోకి రాకుండా అడ్డుకున్న గ్రామ పెద్దలు.. ఎందుకంటే

అరుదైన దృశ్యం.. సౌదీ ఎడారిలో మంచు.. ప్రతి ఒక్కరు తప్పక చూడాల్సిన వీడియో

అండమాన్‌ నికోబార్‌ దీవులకు.. పేర్లు పెట్టే ఛాన్స్‌