23 ఏళ్ల పోరాటం.. రూ.85 కోట్ల భరణం విడాకుల కేసులో ట్విస్ట్
యూకేలో భారత సంతతికి చెందిన వర్షా గోహిల్ 23 ఏళ్ల పాటు సాగిన విడాకుల పోరాటంలో చివరకు రూ.85 కోట్ల పరిహారం పొందారు. భర్త భద్రేష్ గోహిల్ ఆస్తులను దాచిపెట్టినట్లు వెలుగులోకి రావడంతో ఆమె పాత సెటిల్మెంట్ను సవాలు చేశారు. మనీలాండరింగ్ కేసులో బయటపడిన కొత్త ఆధారాల నేపథ్యంలో కోర్టు 6.6 మిలియన్ పౌండ్లు చెల్లించాలని తీర్పు ఇచ్చింది.
యూకేలో భారత సంతతి మహిళ 23 ఏళ్ల పాటు విడాకుల కేసులో పోరాడారు. యూకేలోనే అత్యంత అరుదైన విడాకుల పోరాటంలో భారత సంతతికి చెందిన వర్షా గోహిల్ ఏకంగా 6.6 మిలియన్ పౌండ్లు.. అంటే రూ. 85 కోట్ల పరిహారాన్ని పొందారు. ఈ కేసు 2002లో ప్రారంభమైంది. తన భర్త భద్రేష్ గోహిల్ వివాహేతర సంబంధాలు కలిగి ఉన్నాడని.. అతని ప్రవర్తన సరిగ్గా లేదని వర్షా గోహిల్ విడాకుల కోసం కోర్టు మెట్లు ఎక్కారు. ఆమెకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. అప్పట్లో ఇద్దరి మధ్య ఆర్థికంగా సెటిల్మెంట్ సాదాసీదాగా ముగిసింది. వర్షా దాదాపు రూ. 3.5 కోట్ల క్యాష్తో పాటు కుటుంబానికి చెందిన ప్యుజో కారును తీసుకోవడానికి అంగీకరించారు. కానీ, తన భర్త తన ఆస్తులన్నింటినీ నిజాయితీగా వెల్లడించలేదని ఆమె ఆరోపించారు. నైజీరియా మాజీ గవర్నర్ జేమ్స్ ఇబోరి అనుచరులతో ముడిపడి ఉన్న మనీలాండరింగ్ కేసులో భద్రేష్ గోహిల్ ప్రధాన నిందితుడు. దాంతో కథ మొత్తం అడ్డం తిరిగింది. ఆఫ్షోర్ కంపెనీలు, క్లయింట్ ఖాతాల ద్వారా భద్రేష్ మిలియన్ల కొద్దీ పౌండ్లను అక్రమంగా బదిలీ చేశాడనే ఆరోపణలు ఉన్నాయి. సుదీర్ఘ విచారణ అనంతరం మనీలాండరింగ్, ఫోర్జరీ, మోసపూరిత కుట్రకు పాల్పడినట్లు రుజువు కావడంతో 2011లో భద్రేష్ గోహిల్ కు 10 ఏళ్ల జైలు శిక్ష పడింది. విచారణలో మొదటి విడాకుల కేసు సమయంలో బయటపడని కోట్ల రూపాయల విలువైన ఆస్తులు వెలుగులోకి వచ్చాయి. వివిధ దేశాల్లో విస్తరించి ఉన్న నెట్వర్క్ కంపెనీల ద్వారా భద్రేష్ దాదాపు 28 మిలియన్ పౌండ్లను దాచాడని అధికారులు ఆ ఆస్తులను ఫ్రీజ్ చేశారు. ఈ కొత్త ఆధారాలు వర్షా గోహిల్కు తన పాత విడాకుల సెటిల్మెంట్ను తిరిగి సవాలు చేయడానికి కొండంత బలాన్ని ఇచ్చాయి. కేసు చివరకు యూకే కోర్టుకు చేరింది. జప్తు చేసిన భద్రేష్ ఆస్తుల నుంచి తనకు మరింత భరణాన్ని ఇవ్వాలంటూ ఆమె కోర్టును ఆశ్రయించారు. జప్తు చేసిన మొత్తం యావత్తూ అక్రమార్జన కాదని.. అందులో కష్టపడి సంపాదించిన మొత్తం కూడా ఉందని ఆమె కోర్టుకు తెలిపారు. దీంతో వర్షా గోహిల్ వాదనతో అంగీకరించిన కోర్టు.. జప్తు చేసిన మొత్తంలో 66 లక్షల పౌండ్లు చెల్లించాలని తీర్పు ఇచ్చింది. ఇకపై ఎలాంటి అప్పీళ్లకు అవకాశం లేదని కోర్టు స్పష్టం చేయడంతో 23 ఏళ్ల పోరాటానికి తెరపడింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బైక్ ట్యాక్సీ రైడర్గా.. ఓటమి భయం నుంచి బయటపడ్డాడు!
రూ.40 లక్షల జీతం.. బీఎండబ్ల్యూ కారు.. అయినా పేదవాడిగా ఫీలవుతున్నా!
